హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ప్రారంభోత్సవంపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్లో ‘తెలంగాణ కోసం ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించిన సీఎం కేసీఆర్ దార్శనికతకు వందనాలు. ఈ రోజు సీసీసీని రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్నాం’ అని ట్వీట్ చేసి, దానికి సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకొన్నారు. మరో ట్వీట్ చేసిన మంత్రి.. ఇది కేసీఆర్ తెలంగాణ అని తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ (త్రీ-ఐ) మంత్రతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.తెలంగాణలో అభివృద్ధి చేసిన యాదాద్రి ఆలయం, కాళేశ్వరం ప్రాజెక్ట్, రోడ్లు, టీహబ్, తీగల వంతెన, టీఎస్పీఐసీసీసీ ఫొటోలను ట్వీట్ చేశారు.