యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 20: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో కొలువైన దేవదేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్తజనులను అలరించింది. స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్రవారం నిత్యపూజ కైంకర్యాల అనంతరం స్వామివారికి మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలు యజ్ఞాచార్యులు, పారాయణదారులు, ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకోత్సవం అనంతరం.. ప్రధానాలయ వెలుపలి ప్రాకారంలోని కల్యాణ మండపంలో స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి పశ్చిమ రాజగోపురం గుండా ఉత్తరం, తూర్పు, దక్షిణ మాడ వీధుల్లో ఊరేగించారు. పారాయణదారులు, యాజ్ఞికులు, అర్చక బృందం, వేద మంత్రోచ్ఛారణలు, మూలమంత్ర జపస్తోత్రాలతో మంగళవాయిద్యాలు మోగుతుండగా.. భక్తజనులు గోవిందనామ స్మరణలు చేస్తూ ప్రధానాలయ తిరుమాడ వీధుల్లో స్వామివారి అలంకార సేవ సాగింది.
పట్టువస్ర్తాలు, బంగారు, వజ్రాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమంగళకరంగా అలంకరించిన స్వామివారిని తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అధిష్ఠింపజేసి సేవించి తరించారు. నాలుగు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, దివ్యప్రబంధ ప్రాశుర పఠణాలు కనులపండువగా చేపట్టారు. మహావిష్ణువు అవతార రూపాల్లో స్వామివారిని ఉత్సవాల్లో అలంకరించి సేవించడం అలంకార ఉత్సవాల ప్రత్యేకత అంటూ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు మత్స్యావతార విశిష్టతను భక్తులకు వివరించారు. సాయంత్రం శేషవాహన సేవలో తిరుమాడ వీధుల్లో ఊరేగారు. తూర్పు మాడ వీధుల్లో శేషవాహనం విశిష్ఠతను ఆలయ ప్రధానార్చకులు వివరించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశికధర్మకర్త బీ నరసింహమూ ర్తి, ఈవో భవానీశంకర్, డీఈవో దోర్భల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భటర్ సురేంద్రాచార్యులు, ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.