TS Minister Vemula | ఖలీల్వాడీ, మే 28 : తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతి వివరించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరగాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమన్వయ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మద్దతుతో కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారని, కొట్లాడి సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు 16 లక్షల ఎకరాల్లో వరి పండితే ఇప్పుడు 56 లక్షల ఎకరాల్లో వరి పండుతుందని, ఇది కేవలం కేసీఆర్ నిర్ణయాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలతో సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. దేశానికి ధాన్యాగారంగా చెప్పుకునే పంజాబ్ను కూడా వరిసాగులో తెలంగాణ అధిగమించిందని, 50 శాతం కన్నా ఎక్కువ దేశానికి ధాన్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఫాక్స్ కాన్ లాంటి ఎన్నో పెద్ద కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధే కారణమన్నారు.
తొమ్మిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా దశాబ్ది ఉత్సవాలు జరగాలని, వేడుకలను ఘనంగా జరుపుకోవాలని మంత్రి వేముల అన్నారు. అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో వేడుకలు జరగాలని, ఇందుకు అందరి సహకారం అవసరమని, అందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుపుకోవాలని, ప్రతి మండలానికి నోడల్ అధికారిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వార్డుల్లో సమన్వయ కమిటీలు నియమించాలన్నారు.
జూన్ 2 నుంచి 22 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని, కేసీఆర్ ఆదేశాల మేరకు రోజుకోక కార్యక్రమం ఉంటుందని మంత్రి వేముల పేర్కొన్నారు. రోజుకో రీతిలో ఆయా రంగాల్లో సాధించిన విజయాలపై దశాబ్ది ఉత్సవాలు సంబురంగా జరగాలని, అందరూ భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అడిషనల్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.