హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల రంగంపై శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. చివరికి తానే ‘తెల్ల’మొఖం వేసింది. అవకాశం ఉన్నా.. సమయం ఉన్నా.. చర్చ జరుపకుండానే యూటర్న్ తీసుకున్నది. సభను హడావుడిగా శనివారానికి వాయిదా వేసింది. కాళేశ్వరం పెద్ద స్కాం అని, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చేసిన అక్రమాలన్నీ శ్వేతపత్రంలో బయటపెడుతామంటూ మొదటి నుంచీ సవాళ్లు విసురుతున్న అధికార కాంగ్రెస్ నేతలు.. తీరా సమయానికి వెనుకడుగు వేశారు. చర్చకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరో ప్రతిపక్షం బీజేపీ ప్రకటించినా కాంగ్రెస్ జారుకున్నది. ‘ప్రిపేర్’ కాలేదని, అందుకే సభను వాయిదా వేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి శుక్రవారం సభలో కులగణనపై ప్రభుత్వ తీర్మానం, ‘తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగం-శ్వేతపత్రం’పై లఘు చర్చ ఉంటుందని ప్రకటించారు.
శాసనసభ బులెటిన్ కూడా గురువారం విడుదల చేసి మరీ చెప్పారు. ప్రభుత్వం కూడా ఇదే ప్రకటించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా శుక్రవారం శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని, ఇరిగేషన్పై ప్రజెంటేషన్ ఉంటుందని చెప్పారు. సభలోపల కూడా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం చెప్పడంతో ప్రతిపక్ష పార్టీలు సిద్ధమై వచ్చాయి. దాదాపు సభ్యులంతా అందుబాటులో ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం శుక్రవారం సభను నిర్వహించిన తీరును చూస్తే చర్చకు సిద్ధంగా లేదన్న సూచనలు కనిపించాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు నాలుగు గంటలకుపైగా జీరో అవర్ జరిగింది. ఏకంగా 33 మంది శాసన సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించినప్పుడే ప్రతిపక్ష సభ్యులకు అనుమానం మొదలైంది.
ఆ తర్వాత కులగణనపై చర్చ జరిగింది. సాయంత్రం 4 గంటలకు శ్వేతపత్రంపై చర్చ మొదలవుతుందనుకున్న దశలో.. సభకు ‘టీ బ్రేక్’ అంటూ విరామం ఇచ్చారు. ఈ విరామం దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. అనంతరం 6 గంటలకు సభ ప్రారంభం కాగానే ‘ఆలస్యం’ అయ్యిందన్న కారణంతో వాయిదా వేయాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. గురువారం సభ రాత్రి 9 గంటల వరకు కొనసాగిందని, మండలి 11 గంటల వరకు కొనసాగిందని, ఇదే తరహాలో కనీసం నాలుగైదు గంటలు చర్చ జరుపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు, బీజేపీ సభ్యులు కోరినా వినలేదు. హడావిడిగా శనివారానికి వాయిదా వేశారు.
తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సభలో చర్చకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. కానీ, అప్పుడు సీఎల్పీ నేతగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి మాత్రం ఈ అంశంపై తాము ప్రిపేర్ అయ్యి
రాలేదని చేతులెత్తేశారు.
అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. నాటి సీఎల్పీ నేత ఉత్తమ్కుమార్రెడ్డినే ఇప్పుడు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి. గత పదేండ్లలో నీటిపారుదల రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలచేస్తామని సీఎం రేవంత్రెడ్డి, సంబంధితశాఖ మంత్రి ఉత్తమ్ గురువారమే (15వ తేదీ) ప్రకటించారు. అందుకు విపక్షాలన్నీ సర్వసన్నద్ధంగా సభకు వచ్చాయి. తీరా, సభను సాగదీసి సాగదీసి వాయిదా వేశారు. శ్వేతపత్రం ఎక్కడ అని అడిగితే 17వ తేదీన సభలో పెడుతాం అని ప్రభుత్వం జవాబు చెప్పింది. అంటే ముందుగా చెప్పిన సమయానికి ప్రభుత్వం ఆ అంశంపై ప్రిపేర్ అయ్యి రాలేదన్నమాట. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పడూ ప్రిపేర్ కాలేదు.. నేడు అధికారంలోకి వచ్చినా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఇదీ ప్రాజెక్టులపై కాంగ్రెస్ వ్యవహారం.
శనివారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభకే పరిమితం చేసేందుకు ప్రభుత్వం ఇరిగేషన్పై చర్చను శనివారానికి వాయిదా వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. కథ మొత్తం మేడిగడ్డ చుట్టూ తిప్పడం ద్వారా.. మరోమారు కేసీఆర్పై నోరుపారేసుకోవడం ద్వారా.. సాగునీటి రంగంలో తెలంగాణ విజయాలను మరుగున పర్చవచ్చన్నది అధికార పక్షం ఆలోచనగా కనిపిస్తున్నది.
నీటిపారుదల రంగం శ్వేతపత్రంపై చర్చను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేసిందని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ‘ప్రిపేర్’ కాకపోవడం ప్రధాన కారణం కాగా.. శనివారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభకు పరిమితం చేసేందుకే ప్రభుత్వం చర్చను వాయిదా వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. బీజేపీ పక్ష నేత మహేశ్వర్రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ‘నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రిపేర్ కాలేదా?’ అని ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. సభ వాయిదా పడగానే ‘ఉత్తమ్ సిద్ధం కాలేదేమో’ అని అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడి జైన్పై అసెంబ్లీలో చర్చించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తమ్ ‘మేం ప్రిపేర్ కాలేదు’ అని జారుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇలాగే జరిగిందంటూ జోకులు పేలాయి.
సాధారణంగా సభలో అధికార పక్షం చర్చకు పెడితే ప్రతిపక్షం సమాధానం చెప్పలేక వాయిదా కోరుతుంది లేదా జారుకుంటుంది. కానీ, శుక్రవారం విపక్షాలు చర్చకు పట్టుబట్టగా ప్రభుత్వం సభను వాయిదా వేసుకొని జారుకొన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్వేతపత్రంపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షం చెప్తుంటే, అధికార పక్షం మాత్రం వాయిదా వేసుకున్నదని అంటున్నారు. ‘మంత్రి ఉత్తమ్కు అదనంగా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను చర్చలో మాట్లాడేందుకు సిద్ధం చేయించారట. అయినా ఎందుకు వాయిదా వేశారో’ అని కొందరు నేతలు ఆశ్చర్యపోగా.. ‘కేఆర్ఎంబీపై, కాళేశ్వరంపై చర్చ సందర్భంగా హరీశ్రావు అధికార పక్షాన్ని ఏ రేంజ్లో ఆడుకున్నారో గుర్తుకువచ్చి ఉంటుంది. అందుకే మరింత ప్రిపేర్ అయ్యేందుకు వాయిదా వేశారు’ అని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారు.
వాస్తవానికి ఈ నెల 15వ తేదీ వరకే సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. చివరి నిమిషంలో గురువారానికి పొడిగించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గురువారం ముగిస్తామని ప్రభుత్వం తరఫు నుంచి హామీ రావడంతో ప్రతిపక్ష నేతలు ఇతర కార్యక్రమాలకు షెడ్యూల్ వేసుకున్నారు. గురువారం కూడా సభలో ఎజెండా పూర్తికాకపోవడంతో శుక్రవారం సమావేశాలను ముగిస్తామని, ఇరిగేషన్పై చర్చ ఉంటుందని చెప్పింది. కానీ ప్రభుత్వం అర్ధంతరంగా వాయిదా వేసి మరోరోజు సమావేశాలను పొడిగించి శనివారం నీటిపారుదల రంగంపై చర్చ పెట్టడంతో ఎమ్మెల్యేలకు ఇబ్బంది తప్పడం లేదు.
కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంపై రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టులను అప్పగిస్తామని ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇవ్వటం, దానిపై విపక్ష బీఆర్ఎస్ పోరు తీవ్రం చేయటంతో రేవంత్ సర్కారు మాటమార్చి ప్రాజెక్టులు అప్పగించబోమని ప్రకటించింది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపైనే శుక్రవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర జల్శక్తి శాఖ మరో సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ భేటీకి వస్తామని ముందుగా చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తీరా ఒకరోజు ముందు అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల ఉన్నందున రాలేమని లేఖ రాసింది. అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టేది ముఖ్యమంత్రో, సంబంధిత శాఖ మంత్రో చేస్తారు.
ఢిల్లీ సమావేశానికి హాజరు కావాల్సింది అధికారులు. మరి ఢిల్లీ మీటింగ్కు అధికారులు వెళ్లేందుకు అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టడం అడ్డెలా అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంత కీలకమైన సమావేశానికి డుమ్మా కొట్టిన ప్రభుత్వం.. ఇటు శ్వేతపత్రమైనా పెట్టిందా అంటే అదీ లేదు. కారణం చెప్పకుండానే ఆ కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేసింది. దీన్నిబట్టే ప్రభుత్వం ఎంత డొల్లతనంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాల్లో సాధారణంగా సభా నాయకుడు సభకు వచ్చి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని విపక్ష సభ్యులు తరుచూ పట్టుబట్టడం చూస్తుంటాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ రివర్స్లో సాగుతున్నది. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలని సాక్షాత్తూ సభా నాయకుడైన సీఎం పదేపదే కోరటం విడ్డూరమని రాజ్యాంగ కోవిధులు అంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీరియస్ అంశాలను సైతం పక్కనబెట్టి తరుచూ చర్చను విపక్ష నేత కేసీఆర్ చుట్టూనే తిప్పుతున్నారు. సీఎం అయితే తన స్థాయిని దిగజార్చుకొని విపక్ష నేతను బూతులు తిడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.