నాంపల్లి కోర్టులు, జనవరి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నాంపల్లి 4వ అదనపు జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. 2019లో భార్యను చంపిన కేసులో భర్తకు ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో భార్య నసీంఅక్తర్ (35)ను అదనపు కట్నం కోసం వేధించి భర్త ఇమ్రాన్ ఉల్హక్ చంపేశాడు.
బావమరిది మహ్మద్ మజ్హీరుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 2019లో 302, 498-ఏ ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి సాక్ష్యాధారాలతోసహా చార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే శ్రీవాణి వాదన, సాక్షుల వాంగ్మూలాలు విన్న కోర్టు నిందితుడిపై నేరం రుజువుకావడంతో ఉరిశిక్షను ఖరారు చేసింది. 498-ఏ కింద మూడేండ్ల జైలుశిక్ష, జరిమానాను విధించింది. హైకోర్టు ఆనుమతితో ఉరిశిక్షను అమలు చేస్తారు.
హత్య జరిగిందిలా..
2004లో నసీంఅక్తర్తో ఇమ్రాన్ ఉల్ హక్కు వివాహమైంది. ఐదేండ్లు వీరి కాపురం సాఫీగా సాగింది. వీరికి నలుగురు ఆడపిల్లలు పుట్టారు. నాలుగేండ్ల క్రితం నిందితుడు మైమోనా సుల్తానా అనే మరో మహిళను రెండో పెండ్లి చేసుకున్నాడు. నాటి నుంచి మొదటి భార్య నసీంఅక్తర్ను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. కారు కొనేందుకు రూ.30 వేలు తీసుకురావాలని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఒకరోజు సుత్తితో ఆమె తలపై మోది, కత్తెర సాయంతో గొంతును కోసి, ప్రైవేటు భాగాల్లో స్క్రూడ్రైవర్ ప్రవేశపెట్టి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణలో నిందితుడు ఇమ్రాన్ ఉల్హక్పై నేరం రుజువు కావడంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. నలుగురు ఆడపిల్లలకు పరిహారం అందించాలని ఆదేశించింది.