నస్రుల్లాబాద్, దేవరకద్ర, ఎల్లారెడ్డిపేట, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఇదొక గుండె బరువెక్కే సందర్భం… జీవితంలో ఎవరికీ రాకూడని దుఃఖ బాధ… తమ తండ్రుల మరణంతో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ.. బాధను దిగమింగుతూ ముగ్గురు విద్యార్థులు సోమవారం పదోతరగతి పరీక్షకు హాజరయ్యారు.
రాష్ట్రంలోని కామారెడ్డి, మహబూబ్నగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో ఈ బాధాతప్త ఘటనలు చోటుచేసుకొన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో దండు శ్రీనివాస్(39) అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో శ్రీనివాస్ మృతి చెందాడు. పదోతరగతి చదువుతున్న అతని చిన్న కూతురు స్రవంతి తండ్రి చనిపోయిన బాధ దుఃఖాన్ని దిగమింగుకొని మండలంలోని మిర్జాపూర్ ఉన్నత పాఠశాల కేంద్రంలో పరీక్షకు హాజరైంది.
అదేవిధంగా, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన కుర్వ హన్మంతు కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. కన్న తండ్రి లేడన్న బాధ, పుట్టెడు దుఃఖంతో.. కన్నీళ్లను దిగమింగుకొని అతని కొడుకు అజయ్ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు.
కాగా, రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ ల పరిధి గొల్లపల్లికి చెందిన పుట్టి రవి(38) అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందాడు. పెద్దలు నచ్చజెప్పగా ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ కొడుకు శ్రావణ్ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు. బాధిత కుటుంబానికి సాయం చేసేందుకు 9553894260కు గూగుల్ పే చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.