హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ల కొరతను అధిగమించేందుకు ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నది. వివిధ రీజియన్లలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కండక్టర్లను నియమించుకునే గడువును మరో 6 నెలలపాటు పొడిగిస్తూ సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆమోదంతో ఎండీ నాగిరెడ్డి ఈ పొడిగింపునకు అనుమతిచ్చారు. గతంలో 2026 జనవరి 1 నుంచి 2026 జూన్ 30 వరకు ఉన్న గడువును, తాజాగా 2026 జూలై 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం రీజియన్లలో ప్రస్తుతం ఉన్న మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నిర్దేశిత నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి ఔట్సోర్సింగ్ కండక్టర్లను నియమించుకునేందుకు ప్రాంతీయ మేనేజర్లకు అనుమతి లభించింది. ఎస్సెస్సీ, దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కండక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.