అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. శ్మశాన వాటికకు సమాచారం అందించారు. బంధు, మిత్రులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఆ వ్యక్తి ఒక్కసారిగా చేయి కదిలించడంతో అంతా అవాక్కయ్యారు. వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. ఈ విచిత్ర సంఘటన హైదరాబాద్లోని బోయిన్పల్లి పరిధిలో జరిగింది.
బోయిన్పల్లి పరిధిలో నివాసముండే ప్రసాద్ శర్మకు మంగళవారం గుండెపోటు వచ్చింది. అతడిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ వెంటిలేటర్పై వైద్యులు అతడికి చికిత్స అందించారు. అయితే, కుటుంబ సభ్యులు అతడు చనిపోయాడనుకుని ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కాగా, ప్రసాద్శర్మ ఒక్కసారిగా తన చేయిని కదిలించారు. ఈ ఘటనతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు అతడికి హుటాహుటిన మళ్లీ దవాఖానకు తరలించి, చికిత్స చేయిస్తున్నారు.