National Film Awards | భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72nd National Film Awards) ప్రకటనకు సమయం ఆసన్నమైంది. 2024 సంవత్సరానికి గానూ అందించే ఈ అవార్డుల విజేతల వివరాలను ఈరోజు సాయంత్రం కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారికంగా ప్రకటించనుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యురీ గురువారంతోనే అవార్డుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.
ఇక ఈసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుండి అవార్డుల కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) చిత్రం ‘ఉత్తమ చిత్రం’ (Best Film) లేదా ‘ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్’ (Best VFX) కేటగిరీల్లో అవార్డు సాధించడం ఖాయమని పరిశ్రమ వర్గాలు బలంగా ఆశిస్తున్నాయి. అలాగే గతంలో ‘పుష్ప: ద రైజ్’ చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ నటుడిగా రికార్డు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఈసారి ‘పుష్ప 2: ద రూల్’ (Pushpa 2: The Rule) చిత్రంలో తన అద్భుత నటనకు గానూ మళ్లీ రేసులో నిలిచారు.
అయితే ఈ ఏడాది ఉత్తమ నటుడి (Best Actor) విభాగంలో టాలీవుడ్కు ఇతర భాషల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘భ్రమయుగం’ (Bramayugam) చిత్రంలో చూపించిన అసాధారణ నటనకు గానూ ఈ అవార్డు రేసులో ముందంజలో ఉన్నారు. మమ్ముట్టితో పాటు బాలీవుడ్ నుండి కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’ (Chandu Champion), అజయ్ దేవగణ్ ‘మైదాన్’ (Maidaan) చిత్రాల ద్వారా గట్టి పోటీని ఇస్తున్నారు. అయితే ఈ అవార్డులను ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది మరికొద్ది గంటల్లో అధికారికంగా వెలువడనుంది.