నెన్నెల, ఆగస్టు 28: పడకొండేండ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతురు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. మంచిర్యాల జిల్లా నెన్నెల బోయవాడకు చెందిన ముస్కె వెంకటి, మధునక్క దంపతుల కూతురు రజిత తన 15వ ఏట 2010లో చిన్న గొడవ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం ఏడాదిపాటు వెతికినా ఆచూకీ దొరకలేదు. అదే సమయంలో బెల్లంపల్లి, తాండూర్ మధ్య రైల్వే లైన్లో మృతదేహం లభించగా, అది రజితదే అనుకున్నారు. కాగా, మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్లిన రజిత అక్కడే రాజు అనే వ్యక్తిని 2014లో పెండ్లి చేసుకొన్నది. వీరికి అయిదేళ్ల పాప ఉన్నది. కాగా, కుటుంబసభ్యులు గుర్తుకొచ్చి రజిత శుక్రవారం నాందేడ్ నుంచి బెల్లంపల్లికి వచ్చింది. అక్కడ నెన్నెల గ్రామస్థులను చూసి వారితో ఇంటికి చేరుకున్నది. చనిపోయిందనుకున్న కూతురు తిరిగి రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేకుండాపోయాయి.