హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణానికి ఎన్వోసీ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బుద్ధభవన్లోని నార్త్ ట్యాంక్ డివిజన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా యాత పవన్కుమార్ పనిచేస్తున్నారు. ఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని శాంతినగర్లో కమర్షియల్ భవనం నిర్మించేందుకు రామంతాపూర్కు చెందిన ఓ బిల్డర్ నిరభ్యంతరపత్రం (ఎన్వోసీ) కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం డీఈ రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు శుక్రవారం మొదటగా రూ.4లక్షలను బుద్ధభవన్లోని కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు పనుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని సూచించారు.