Deccan chronicle | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 24 (నమస్తే తెలంగాణ): ఆ పత్రిక కథనాలకు ఆధారం ఉండదు.. ఆరోపణలకు ప్రాతిపదిక కనిపించదు.. కేవలం తెలంగాణ సర్కారుపై బురదజల్లాలి.. అంతే. తప్పుడు కథనాలతో ఆ పత్రిక తానా అంటే.. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలతో తందానా అంటున్నాయి. ఔటర్ రింగురోడ్డు లీజు వ్యవహారంపై ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్ తీరు ఇలాగే తయారైంది. టెండరు నిబంధనలు పట్టవు.. వాస్తవాలు తెలియవు.. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఒకేఒక్క దురాలోచన కేంద్రంగా దక్కన్ క్రానికల్ రెండు రోజుల కిందట ‘పది శాతం అడ్వాన్సు చెల్లించలేమంటున్న ఐఆర్బీ’ పేరుతో ప్రచురించి కథనంపై హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజా బాహుళ్యంలో ఉన్న సమాచారాన్ని సైతం పరిశీలించకుండా, తమకు వచ్చిన సమాచారం నిజమో కాదో కూడా ధ్రువీకరించుకోకుండా వార్త రాయటంపై మండిపడింది. మూడు రోజుల్లో వాస్తవాలతో వివరణ ఇవ్వాలని హెచ్ఎండీఏ అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు హెచ్ఎండీఏ న్యాయవాది అనిశారెడ్డి దక్కన్ క్రానికల్కు బుధవారం నోటీసులు జారీ చేశారు. పత్రిక స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. డీసీ కథనంపై ఐఆర్బీ సంస్థ కూడా తీవ్రంగా స్పందించింది. సదరు పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించడంతోపాటు ఆ కథనంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసింది. అసలే ఆ పత్రిక అడ్డదిడ్డమైన వార్త రాస్తే… దానిని పట్టుకొని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం గమనార్హం.
ఔటర్ రింగురోడ్డుపై టోల్ వసూలు, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం గ్లోబల్ టెండర్లు నిర్వహించి, లీజుకు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తుండగా… ఒక వర్గం మీడియా కూడా పనిగట్టుకొని తప్పుడు కథనాలు వండి వార్చుతున్నది. రెండు రోజుల కిందట దక్కన్ క్రానికల్ అభూత కల్పనలతో కథనాన్ని ప్రచురించింది. లీజు దక్కించుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్ టెండర్ నిబంధనల ప్రకారం 30 రోజుల్లో లీజు మొత్తంలో పది శాతాన్ని చెల్లించాల్సి ఉండగా.. ప్రస్తుతం తాను చెల్లించుకోలేనని హైదరాబాద్ గ్రోత్ కారిడార్కు లేఖ రాసిందని, దీంతో తెలంగాణ ప్రభుత్వం 120 రోజుల గడువు ఇచ్చిందని కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని హెచ్ఎండీఏతోపాటు ఐఆర్బీ తీవ్రంగా ఖండించాయి. సదరు పత్రికకు హెచ్ఎండీఏ లీగల్ నోటీసు జారీ చేసింది.
ఓఆర్ఆర్ను 30 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు గత ఏడాది నవంబర్ 9న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. 11 సంస్థలు బిడ్లు దాఖలుచేయగా, సాంకేతిక పరిశీలన అనంతరం నాలుగు కంపెనీలు అర్హత సాధించాయి. ఈ సంస్థలు బిడ్ సెక్యూరిటీ కింద రూ.15.80 కోట్ల చొప్పున డిపాజిట్ చేశాయి. ప్రైస్ బిడ్లను తెరవగా అత్యధికంగా రూ.7,272 కోట్లు కోట్ చేసి ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్ హెచ్-1గా నిలిచింది. ఈ క్రమంలో లీజు మొత్తాన్ని పెంచాలని హెచ్ఎండీఏ కోరగా, 30 ఏండ్ల లీజుకుగాను ఐఆర్బీ రూ.7,380 కోట్లకు పెంచింది.
అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 27న హెచ్-1 బిడ్డర్ అయిన ఐఆర్బీ ఇన్ఫ్రాకు హెచ్ఎండీఏ అంగీకార పత్రాన్ని (లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్) జారీ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం ఐఆర్బీ ఇన్ఫ్రా 30 రోజుల్లో ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి హెచ్ఎండీఏతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఏప్రిల్ 27న అంగీకార పత్రం జారీ చేసినందున ఈ నెల 27లోపు ఐఆర్బీ ఎస్పీవీని ఏర్పాటు చేసి హెచ్ఎండీఏతో ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే ఎస్పీవీని ఏర్పాటు చేయగా, ఒప్పంద ప్రక్రియ పురోగతిలో ఉన్నది.
టెండర్ నిబంధనల ప్రకారం హెచ్-1 బిడ్డర్ హెచ్ఎండీఏ అంగీకార పత్రం జారీ చేసిన తేదీ నుంచి 45 రోజుల్లో రూ.29.71 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి. అందుకు ఇంకా సమయం ఉన్నది. దీంతోపాటు హెచ్-1 బిడ్డర్కు హెచ్ఎండీఏ అంగీకార పత్రం ఇచ్చిన తేదీ నుంచి 120 రోజుల్లో లీజు మొత్తం రూ.7,380 కోట్లు చెల్లించాలని టెండర్ నిబంధనల్లో ఉన్నది. ఇందుకు కూడా ఇంకా చాలా సమయం ఉన్నది.
హెచ్ఎండీఏ అంగీకార పత్రం జారీ చేసిన నెల రోజుల్లో ఐఆర్బీ లీజు మొత్తంలో 10 శాతం చెల్లించాల్సి ఉన్నదని డీసీ రాసింది. కానీ టెండర్ నిబంధనల్లో ఎక్కడా పది శాతం అనే అంశమే లేదు. నెల రోజుల్లో పది శాతం మొత్తం చెల్లించి, ఆపై మరో మూడు నెలల్లో లీజు మొత్తాన్ని చెల్లించాలని డీసీ రాసింది. కానీ ఇది కూడా టెండర్ నిబంధనల్లో లేదు.
ఐఆర్బీ నెల రోజుల్లో పది శాతం చెల్లించడంలో విఫలం కాగా… ఆ కంపెనీ విజ్ఞప్తి మేరకు లీజు మొత్తాన్ని చెల్లించేందుకు హెచ్ఎండీఏ 120 రోజుల గడువు ఇచ్చినట్టు డీసీ రాసింది. ఇది పూర్తిగా అవాస్తవం. అసలు నెల రోజుల గడువు, పది శాతం చెల్లింపు అంశాలే టెండర్ నిబంధనల్లో లేనపుడు ఇవన్నీ ఉత్పన్నం కావు.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రీ బిడ్ సమావేశాల సందర్భంగానే.. అంటే ఈ ఏడాది మార్చిలోనే ఐఆర్బీతో ఒప్పందం చేసుకొన్నదనేది పూర్తిగా అబద్ధం. పైగా పది శాతం చెల్లించడంలో ఐఆర్బీ విఫలమైనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందంటూ కథనంలో పేర్కొన్నారు. అసలు పది శాతం అంశమే నిబంధనల్లో లేనపుడు ఐఆర్బీ విఫలం, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్జీసీఎల్ లేఖ అనేది దక్కన్ క్రానికల్ సృష్టించిన అభూత కల్పనేనని అర్థమవుతున్నది.
దక్కన్ క్రానికల్ కథనంపై లీగల్ నోటీసులు జారీ చేసిన హెచ్ఎండీఏ, మూడు రోజుల్లో పత్రికలో వాస్తవాలను ప్రజలకు అందించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన, న్యాయపరమైన చర్యల్లో సివిల్, క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. అవసరమైతే పరువు నష్టం దావా కూడా వేస్తామని స్పష్టం చేసింది. ఒక పనికి సంబంధించిన టెండర్లు పిలవడం, టెండర్కు సంబందించిన వివిధ షరతులను సూచించాలనే నిర్ణయం క్షేత్రస్థాయిలోని అనుభవజ్ఞులందరితో నిర్వహించిన అధ్యయనం ద్వారా నిర్ణయించబడుతుందని నోటీసులో తెలిపింది.
‘ఓఆర్ఆర్ టీవోటీని అంతర్జాతీయ బిడ్గా పిలిచాం. అత్యధిక బిడ్ వేసిన వారికి ప్రాజెక్టు కేటాయించడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో నిర్వహించాం. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన టెండర్లలో అత్యధికంగా కోట్ చేసిన వారినే హెచ్-1గా ఎంపిక చేసి, అంగీకార పత్రాన్ని జారీ చేశాం. దశలవారీగా నిర్దేశించబడిన షరతులను బిడ్ పొందిన సంస్థ పాటించకపోతే అంగీకార లేఖ తర్వాత బిడ్ సెక్యూరిటీ మొత్తాన్ని జప్తు చేసి అంగీకార పత్రాన్ని రద్దు చేసే పూర్తి హక్కు హెచ్ఎండీఏకు ఉన్నది’ అని తేల్చిచెప్పింది.