కంటోన్మెంట్. ఫిబ్రవరి 12: తన ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా సాకిన ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాల్సిన ఆ బిడ్డలే తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ హింసించడం మొదలుపెట్టారు. అనారోగ్యం బారిన పడిన తండ్రిని అమానవీయంగా ఇంటి నుంచి గెంటివేయగా, బస్తీవాసులు మానవత్వంతో చేరదీశారు.
మారేడుపల్లి పీఎస్ పరిధిలోని పికెట్ సెకండ్లక్ష్మీనగర్కు చెందిన మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం(70) తన భార్య మరణించిన తర్వాత ఇద్దరు కూతుళ్లు భాగ్యలక్ష్మి(ప్రైవేట్ ఉద్యోగి), ఝూన్సీ(ప్రభుత్వఉద్యోగి)కి 130 గజాల స్థలం, 15 తులాల బంగారు అభరణాలను 2018లో సమానంగా పంచాడు. ప్రస్తుతం రాజలింగం అనారోగ్యానికి గురికావడంతో ఇద్దరు కూతుళ్లు పట్టించుకోవడం మానేశారు.
ఇంటి నుంచి గెంటేయగా, బస్తీవాసులు అక్కున చేర్చుకున్నారు. దీంతో ఇద్దరు కూతుళ్లపై పోలీసులతో పాటు సికింద్రాబాద్ ఆర్డీవోకు ఆయన ఫిర్యాదు చేశాడు.. తల్లిదండ్రుల, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007 సెక్షన్ 23 ప్రకారం తన ఆస్తిని తిరిగి ఇప్పించాలని, కుమార్తెలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో రాజలింగం కుమార్తెలకు ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.