మంథని, ఫిబ్రవరి 9 : కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మంథని పట్టణం(Manthani twon) పోచమ్మ వాడకు చెందిన రావుల మారుతి ప్రసాద్ అనే వ్యక్తికి ఖమ్మం జిల్లాకు చెందిన మౌనిక అనే యువతితో సుమారు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. గత నెల 12వ తారీఖున మౌనికను భర్త మామ ఇద్దరు కలిసి మంథనిలో వారి ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో మౌనిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసి అనంతరం మౌనిక తల్లిదండ్రుల వద్దకు ఖమ్మం జిల్లాకు వెళ్లిపోయింది.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం చర్యలు తీసుకోవడం లేదని, తనకు న్యాయం జరగడం లేదని, తనకు ఒక బాబు ఉన్నాడని, ప్రస్తుతం మళ్లీ ఏడు నెలల గర్భవతినని కన్నీటి పర్యంతమైంది. అనంతరం మంథని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించింది. ఈ సందర్భంగా మౌనిక మీడియాతో మాట్లాడుతూ..తన భర్త ఏ పనిలేక ఖాళీగా తిరుగుతూ తాగి వచ్చి కట్నం కోసం వేధిస్తున్నాడని, మామ దగ్గర పడుకోమని చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఆరోపించింది. మంథని పోలీస్ స్టేషన్లో గత నెల 12 న ఫిర్యాదు చేశానని, నెల రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మౌనికను మంథని పోలీస్ స్టేషన్కు తరలించారు.