Moon | కోల్సిటీ : తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లికి ఓ కూతురు అరుదైన కానుక ఇచ్చింది. ‘చందమామ రావే… జాబిల్లి రావే..’ అంటూ చిన్నప్పుడు తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన తల్లికి చందమామపైనే స్థలాన్ని కొనిచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన రోజునే తన తల్లి పేరు మీద ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించింది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో నివాసం ఉండే సింగరేణి కార్మికుడు సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె సాయి విజ్ఞత ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడింది. అక్కడి గవర్నర్ కిమ్ రెనాల్డ్స్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తుంది. అమెరికా వెళ్లినప్పటి నుంచి ప్రతి ఏడాది మాతృ దినోత్సవం నాడు తన తల్లికి ఏదో ఒక కానుక పంపిస్తూ ఉండేది. కానీ అది సాయి విజ్ఞతకు సంతృప్తిని ఇవ్వలేదు. తనను నవమాసాలు మోసి కన్న తల్లికి ఏదైనా అరుదైన కానుక ఇవ్వాలని పరితపించిపోయింది. ఇప్పటివరకు ఎవ్వరూ ఇవ్వనటువంటి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్న తరుణంలో.. 2022లో చంద్రుడిపై స్థలాలను అమ్ముతున్నట్లు తెలుసుకుంది. లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ అనే సంస్థ చంద్రుడిపై స్థలాలను అమ్మకానికి పెట్టడంతో వెబ్సైట్ను చూసిన ఆమె మరుక్షణం ఆలోచించకుండా తన తల్లి వకుళాదేవి, కుమార్తె ఆర్హ పేరు మీద ఒక ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఉంచింది.
ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం జూన్ 23న జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్గా దిగిన రోజునే చంద్రుడిపై స్థలం రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ విషయం ఇప్పుడు స్థానికంగానే కాకుండానే సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్గా మారింది. ఈ క్రమంలోనే నెటిజనుల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతరిక్షంలో కొనుగోలు చేసే భూములకు హక్కులు ఉంటాయా..? భవిష్యత్లో చంద్రుడి మీదకు మానవులు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందా..? అలా ఇంకా ఎన్నేళ్లు పడుతుంది..?అన్న సందేహాలు మొదలయ్యాయి.