హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో నల్లధనం వరదలా పారిందని, మన ప్రజాస్వామ్య వ్యవస్థ రోజురోజుకూ కుప్పకూలిపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆదేవన వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఉదంతం, మన ప్రజాస్వామ్య మనుగడకు ఎదురవుతున్న పెను ప్రమాదానికి రానున్న సంకేతంగా ఉన్నదని పేర్కొన్నారు. దీనిపై ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదుచేశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను, చివరకు ఎన్నికల యంత్రాంగాన్ని సైతం ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం, గెలిచిన తర్వాత అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టడం అనే ప్రమాదకరమైన సంస్కృతి రాజ్యమేలుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థి సుమారు రూ.7 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేసి, దాదాపు 200 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు తెలిసింది అని ఆరోపించారు. ఒక్క ఓటుకు రూ.70 వేల నగదు, ప్రతి ఇంటికీ 25 కిలోల బియ్యాన్ని ఇచ్చి ప్రలోభపెట్టారని ఆరోపించారు. మొయినాబాద్ మొదలు.. రాష్ట్రమంతటా, మనం చూస్తున్నది ప్రజల తీర్పు కాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు పెట్టిన వారే పీఠం ఎక్కుతున్నారని, ఇది రాజకీయ ప్రక్రియ కాదని తెలిపారు. గెలిచిన అభ్యర్థి ఎన్నికల ఖర్చులు, ఆస్తులపై ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహించాలని, ఈ భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయోనని ఏసీబీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.