వరంగల్ : కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న భక్తులనే బ్రహ్మోత్సవాలకు అనుమతిస్తామని ఈవో ఏ నాగేశ్వర్ రావు బుధవారం స్పష్టం చేశారు.
కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్క భక్తుడు ఫేస్ మాస్క్ ధరించాలని, దర్శన క్యూలైన్లలో భౌతిక దూరం పాటించాలని సూచించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఐనవోలు జాతరకు సుమారు 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు.