MLA Seethakka |ములుగు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు దనసరి అనసూయ(సీతక్క). సోషల్ మీడియాలో ఆమె సెలబ్రిటీ. సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకోవడంలో ఆమె ట్రెండ్సెట్టర్. వెయ్యి రూపాయల సేవ చేసి లక్ష రూపాయల ప్రచారం చేసుకోగలిగిన నైపుణ్యం సీతక్క సొంతం. అయితే, సోషల్ మీడియాను వదిలి క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే ములుగుకు సీతక్కచేసింది ఏమీకనిపించదు. ఎమ్మెల్యేగా సీతక్క విఫలమైనా కేసీఆర్ ప్రభుత్వం
మాత్రం ములుగు ప్రజల్లో వెలుగులు నింపింది. ములుగును జిల్లాగా మార్చింది. గిరిపుత్రులకు మౌలిక వసతులు కల్పించింది. పోడు భూములకు పట్టాలు ఇచ్చి అండగా నిలిచింది. ఇప్పుడు ములుగు మారుమూల జిల్లా కాదు. మాడల్ జిల్లా.
ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ గత పాలకులు ములుగును చిన్నచూపు చూశారు. మేడారం జాతరప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఈ ప్రాంతం వాళ్లకు గుర్తుకొచ్చేది కాదు. ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క రెండుసార్లు గెలిచినా ఆమె నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించలేదన్న విమర్శలు ఉన్నాయి. దశాబ్దాల సమస్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకతో పరిష్కారం లభిస్తున్నది. విద్య, వైద్యం, రవాణా అన్ని రంగాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది.
ములుగు పరిధిలోని జగ్గన్నపేట ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం. సొంతూరుకూ ఆమె చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4కోట్లతో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో అభివృద్ధి చేసింది. పాఠశాలకు జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేసింది. రూ.18లక్షలతో జగ్గన్నపేట గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించింది. అంతేకాదు ములుగులో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మాణాలు జరుగుతున్నాయి. రూ.2 కోట్లతో ములుగు జిల్లా కేంద్రంలో ఆడిటోరియం, గిరిజన భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించారు. రూ.10కోట్లతో ములుగు, మంగపేట మార్కెట్ యార్డులలో గోదాంల నిర్మాణం జరిగింది. వివిధ మండలాల్లో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ప్రజలకు గూడు కల్పించారు. రూ.8 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రాలను నిర్మించారు.
దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్నా హక్కులు లేక ఇబ్బంది పడ్డ గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచింది. ములుగు జిల్లాలో 17,456 మంది పోడు రైతులకు 24,430 ఎకరాలకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులు యాభై ఏండ్లుగా సాగు చేస్తున్న ఎకరం 17 గుంటల పోడు భూమికి సైతం పట్టా అందుకున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ములుగు పట్టణం కేంద్రంగా ములుగు జిల్లాగా ఏర్పాటుచేసింది. 60 ఎకరాల్లో రూ.63.5 కోట్లతో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్ భవనం ఇప్పుడు జిల్లాకు తలమానికంగా నిలువనుంది. దాని పక్కనే విశాల ప్రాంగణాల్లో ఎస్పీ కార్యాలయం, జిల్లా పరిషత్తు కార్యాలయం, కోర్టు భవనం, మినీ స్టేడియం రూపుదిద్దుకుంటున్నాయి. పురుగు పుట్రా కరిస్తే వైద్యం కోసం మైళ్లు ప్రయాణించే పరిస్థితులున్న ములుగు ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వం మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నది. దీనికి అనుబంధంగా 300 పడకల ప్రభుత్వ దవాఖానను నిర్మిస్తున్నది. ఇది పూర్తయితే గిరిజనులకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందుతాయి.
ములుగుకు పర్యాటక సొబగులు దిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రూ.15కోట్లతో గట్టమ్మ, మేడారం, మల్లూరు, తాడ్వాయిల్లో హరిత హోటళ్లను నిర్మించింది. లక్నవరం సరస్సు దగ్గర రూ.6 కోట్లతో కాటేజీలను కట్టించింది. నియోజకవర్గం పరిధిలోని ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నది.
ఎమ్మెల్యే సీతక్క పట్టించుకోకపోయినా కేసీఆర్ ప్రభుత్వం మాకు గూడు కల్పించింది. నాకు మల్లూరులో డబుల్బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. మా ఊర్లో నాతో పాటు ఇల్లు లేని మరో 66మందికి ప్రభుత్వం ఇండ్లు వచ్చాయి. కేసీఆర్ చేసిన మేలును ఎప్పటికి మర్చిపోవద్దనే ఉద్దేశంతో మా కాలనీకి కేసీఆర్ కాలనీ అని పేరు పెట్టుకున్నం.
-తాటి లింగయ్య, మల్లూరు