జయశంకర్ భూపాలపల్లి. ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ)/కాళేశ్వరం/ మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ బరాజ్లను రాష్ట్ర గ్రౌటింగ్, మెకానికల్, డిజైన్ తదితర నిపుణుల బృందం మంగళవారం పరిశీలించింది. బరాజ్ల గ్రౌటింగ్ నిపుణుడు విజయ్ టీ దేశాయ్, సాంకేతిక నిపుణుడు సత్యనారాయణ, డిజైన్ నిపుణుడు రాజశేఖర్, ఇరిగేషన్ హెడ్ అనిల్కుమార్, డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, ఎస్ఈ శ్రీనివాస్, డీఈ దయాకర్రెడ్డి తదితరులు బరాజ్లను పూర్తి స్థాయిలో పరిశీలించారు. మొదట అన్నారం బరాజ్లో ఏర్పడిన సీపేజ్లను పరిశీలించి గ్రౌటింగ్ చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రౌటింగ్కు ఎలాంటి కెమికల్ వాడారు? కెమికల్ ఫోమింగ్ పిరియడ్ ఎంత? ఎన్ని సీపేజ్లకు గ్రౌటింగ్ చేశారు? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈఈ యాదగిరి సీపేజ్ల గురించి, గ్రౌటింగ్ చేసిన తీరును, వాడిన కెమికల్ను నిపుణుల బృందానికి వివరించారు. నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ నిపుణులు హిమాచల్ప్రదేశ్ నుంచి పాలీ యూరిత్రిన్ కెమికల్ను హెలిక్యాప్టర్ ద్వారా తెప్పించి గ్రౌటింగ్ చేశారని తెలిపారు. 38,28 ఔట్లెట్లలో మొదట సీపేజ్లు ఏర్పడ్డాయని, వాటిని నివారించగా మరో చోట నుంచి సీపేజ్లు బయటికి రాగా వాటికి సైతం గ్రౌటింగ్ చేసినట్టు వెల్లడించారు. బరాజ్లోని అప్స్టీమ్, డౌన్స్టీమ్లను, ప్రతి పిల్లర్ను, గ్రౌటింగ్ చేసిన ప్రతి సీపేజ్ను నిపుణుల బృందం పరిశీలించింది. బరాజ్లో అప్స్టీమ్ టు డౌన్స్టీమ్ ఫాం కాలేదని, సీపేజ్లు సాధారణమని, గ్రౌటింగ్ చేసి పకడ్బందీగా అరికట్టాలని, పిల్లర్లకు సైతం ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు అభిప్రాయపడినట్టు తెలిసింది.
ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయించాల్సింది..
ఇప్పటికే బరాజ్ నుంచి నీటిని తొలగించి ఇన్వెస్టిగేషన్ పనులు పూర్తి చేయించాల్సి ఉండేదని నిపుణులు సూచించారు. ఇన్వెస్టిగేషన్ పనులను పార్సన్ సంస్థకు అప్పగించినందున ఇన్వెస్టిగేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని వారు పేర్కొన్నారు.
బరాజ్కు ముప్పేమీలేదు..
మొత్తానికి అన్నారం బరాజ్కు ఆపదేమీ లేదని, కొద్దిపాటి అప్రమత్తతతో బరాజ్ను నిలుపుకోవచ్చని నిపుణులు తేల్చిచెప్పినట్టు తెలిసింది. అక్కడి నుంచి నిపుణుల బృందం మేడిగడ్డ బరాజ్ను సందర్శించి పియర్ల కుంగుబాటుపై విశ్లేషణ జరిపారు. ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నివేదికను ఎన్డీఎస్ఏకు సమర్పిస్తామని చెప్పి వెళ్లారు.
ఎన్డీఎస్ఏకు ప్రతిపాదనలు..
అన్నారం, మేడిగడ్డ బరాజ్లలో నిపుణులు పరిశీలన జరిపి చేపట్టాల్సిన మరమ్మతులపై ప్రతిపాదనలు రూపొందించారు. ఏడో బ్లాకు మినహా మిగిలిన మిగతా బ్లాకుల్లో గ్రౌటింగ్ చేస్తే వర్షాకాలంలో ఇబ్బంది ఉండదనే నిర్ణయానికి వచ్చారు. సెవెన్టీ గ్రౌటింగ్, మైక్రో కాంక్రీట్, సాండ్ గ్రౌటింగ్, ప్రెసర్ గ్రౌటింగ్ వీటిలో ఏ పద్ధతిలో గ్రౌటింగ్ చేయాలనే విషయమై నిపుణులు, అధికారులు చర్చించి ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలిసింది.