కలెక్టరేట్, జనవరి 9: బీజేపీ పాలనలో దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య ఆవేదన వ్యక్తంచేశారు. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోపాటు వారిపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నా వాటిని అరికట్టడంతో మోదీ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యమంటూ ఎన్నికల్లో ఓట్లు దండుకొన్న బీజేపీ నాయకులు ఇప్పుడు అంబేద్కర్ భావజాలంపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.
ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భజరంగ్దళ్ సంఘాలతో దేశంలో లౌకికవాదానికి బీజేపీ సర్కారు ముప్పు తెస్తుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని రెవెన్యూ గార్డెన్లో సోమవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్రస్థాయి ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగ్దళ్, వీహెచ్పీలను ఎదుర్కొనేందుకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో వెయ్యి మంది దళిత యువకులతో కలిపి దళిత దండు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు.