ములుగు రూరల్, మార్చి7 : రెండో విడత దళిత బంధు(Dalith Bandhu) నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ములుగు(Mulugu) జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్ ఆధ్వర్యంలో దళితులు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన (Daliths protest) తెలిపారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
అనంతరం మహేశ్ మాట్లాడుతూ.. అనాది కాలంగా నిర్లక్ష్యానికి, పేదరికానికి ఆర్థిక అసమానతలకు గురైన దళితులను దళిత బంధు పథకం ద్వారా ఆదుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. రెండో విడత దళిత బంధులో కలెక్టర్ ద్వారా నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి గ్రౌండింగ్ పూర్తయిందన్నారు.
డబ్బులు పడే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో తాత్కాలికంగా ప్రక్రియను నిలిపి వేశారని, ఇప్పటి వరకు నిధులు విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల లోపు(వారం రోజుల్లో) కలెక్టర్ ఖాతాలో ఉన్న రూ.26కోట్ల 49లక్షలను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమండ్ చేశారు.