తిరిగి చెల్లించేందుకు ఓ వ్యక్తి నిరాకరణ
పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు
ఖైరతాబాద్, మే 10 : దళిత బంధు నిధులు ఇతర ఖాతాల్లోకి జమ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. హైదరాబాద్లోని సైఫాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొన్నది. వివరాల్లోకివెళ్తే.. దళిత బంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడానికి రంగారెడ్డి జిల్లా ఎస్సీ సర్వీస్ కో ఆపరేటీవ్ డెవలప్మెంట్ గత నెల 25న చెక్కులను ఎస్బీఐ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ బ్రాంచ్కు అందించింది.
26న ఆ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వేసే క్రమంలో 15 మంది లక్డీకాపూల్లోని లోటస్ దవాఖానా సిబ్బంది ఖాతాల్లోకి రూ.7.44 కోట్లు జమ అయ్యాయి. ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు ఆ డబ్బుల రికవరీ పనిలో పడ్డారు. 14 మంది నుంచి రికవరీ చేశారు. ఎం కృష్ణ అనే వ్యక్తి రూ.9.90లక్షలు తిరిగి చెల్లించేందుకు నిరాకరించాడు. దాంతో బ్రాంచ్ మేనేజర్ పలగారి క్రాంతివీర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.