రంగారెడ్డి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి గొప్ప పథకం వస్తదని జీవితంలో ఎవరూ ఊహించి ఉండరని తెలిపారు. రూపాయి కూడా తిరిగి చెల్లించే అవసరం లేకుండా దళితులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలను అందజేస్తున్నదని చెప్పారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని లబ్ధిదారులకు సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోం గ్రౌండ్లో యూనిట్లు పంపిణీ చేశారు. ఇందులో 50 మందికి ట్రాక్టర్లు, కార్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న మేరకు వ్యాపారాలను ఎంచుకోవాలని సూచించారు.
ఎక్కడైనా వ్యాపారం చేసుకొనే వెసులుబాటు ఉన్నదని చెప్పారు. మరోవైపు వ్యాపారాల్లో ఏదైనా అనుకోనిది జరిగితే ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రక్షణనిధిని ఏర్పాటు చేశారని మంత్రి వెల్లడించారు. దశల వారీగా నియోజకవర్గానికి 2 వేల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, యెగ్గె మల్లేశం, దయానంద్, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, జైపాల్ యాదవ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, కలెక్టర్ అమయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.