ఇది ఒక్క సతీశ్ కథే కాదు. దళితబంధు కింద లబ్ధిపొందుతున్న వేల మంది విజయ ప్రస్థానం. ఈ పథకం దళితుల జీవితాల్లో తెస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం. పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజవర్గంలో చేపట్టిన దళితబంధు పథకం అమలు ఇటీవలనే పూర్తయింది. మొత్తంగా 18,021మందికి రూ.10 లక్షల చొప్పున అందజేయగా, లబ్ధిదారులు ప్రారంభించిన వ్యాపారాలు విజయవంతంగా దూసుకుపోతున్నాయి. వాటిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దళితుల సముద్ధరణకు, సాధికారతకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించి అమలు చేస్తున్న దళితబంధు పథకం కొత్త పుంతలు తొక్కుతున్నది. బహుముఖ ప్రయోజనాలను నెరవేర్చుతున్నది. నూతన సమాజ ఆవిష్కరణలకు పునాది వేస్తున్నది. దళితులకు జీవనోపాధి చూపటమేగాక రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి బాటలు వేస్తున్నది. వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధికి ఊతమిస్తూ సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల విస్తరణను ప్రోత్సహిస్తున్నది. దళితులకే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి చూపుతున్నది. ఈ పథకం మొదట ప్రారంభమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి 18,021 దళిత కుటుంబాలను పథకానికి అర్హులుగా గుర్తించారు. వారందరికీ పథకాన్ని వర్తింపజేశారు. రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.1,802.1 కోట్లను వారి బ్యాంకు అకౌంట్లలో జమచేశారు. ఆ తరువాత యూనిట్ల గ్రౌండింగ్ను ప్రారంభించగా, ఇటీవలే ఆ ప్రక్రియ పూర్తయింది. అన్ని యూనిట్ల ద్వారా దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతూ స్థానికంగా వందల మందికి ఉపాధి చూపుతున్నాయి.
సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే వాటిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలదే ప్రధాన పాత్ర. ఫుడ్ ప్రాసెసింగ్, ఇటుకల తయారీ, పేపర్ ప్లేట్స్ తయారీ, క్యాటరింగ్, ఇంజినీరింగ్ వర్క్స్, ఫర్నిచర్ తయారీ తదితర రంగాల్లో అపార అవకాశాలున్నాయి. ఒక్కో యూనిట్ ద్వారా ప్రత్యక్ష్యంగా నలుగురికంటే ఎక్కువ మంది ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి. దళితబంధు పథకం ద్వారా ఈ తరహా పరిశ్రమలు విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. దినసరి కూలీలుగా జీవనం వెళ్లదీసిన దళితులు ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా మారి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్రంలో సూక్ష్మ తరహా పరిశ్రమల విస్తరణ కూడా దళితబంధు ద్వారా మరింత వేగవంతం అయ్యింది. కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, పాడిపరిశ్రమ, చేపల పెంపకం, కాయగూరల సాగు తదితర రంగాలపై ఇప్పటికే ఎంతో మంది ఆధారపడి స్థిరమైన జీవనోపాధి పొందుతున్నారు. సేంద్రియ ఎరువును సరఫరా చేయడంలో వీరు కీలక భూమిక పోషిస్తున్నారు.
ఎవుసానికి యంత్ర పుష్టి
రాష్ట్రంలో వ్యవసాయం విస్తరిస్తున్నంత వేగంగా వ్యవసాయ యాంత్రికత ముందుకు సాగడం లేదు. ఇప్పటికీ వ్యవసాయ యాంత్రికత 45 శాతానికి మించలేదు. అందుకు ప్రధాన కారణం పెట్టుబడి సమస్య. రెండవది చిన్న కమతాలు. దళితబంధు పథకం ఈ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం చూపింది. పథకం కింద దళితులు ఎంచుకొంటున్న యూనిట్లు అత్యధికం వ్యవసాయ యంత్ర పరికరాలే ఉన్నాయి. ట్రాక్టర్లు, రోటోవేటర్లు, మినీ టిల్లర్లు, వరినాటు యంత్రాలు, కోత యంత్రాలు ప్రతీ గ్రామానికి అందుబాటులోకి వస్తున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో నిన్నమొన్నటి వరకు పొలం దున్నడానికి, వరికోతలకు, నాట్లకు రైతులు అడ్వాన్సులు చెల్లించి రోజుల తరబడి నిరీక్షించాల్సి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. సకాలంలో కోతలు పూర్తికావడంతోపాటు, నారుమళ్లను సిద్ధం చేసుకొంటున్నారు.
దళితబంధుతో సంపద సృష్టి
దళితబంధు పథకం ద్వారా బహుముఖ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. దళితుల ఆర్థికాభ్యున్నతికి బాటలు వేస్తుండటంతోపాటు మరింతమందికి ఉపాధి భరోసా కల్పిస్తున్నవి. అన్నింటికంటే ముఖ్యంగా వ్యవసాయరంగ అభివృద్ధికి దళితబంధు ప్రత్యక్షంగా ఎంతో మేలు చేస్తున్నది. లబ్ధిదారులు మరింత వినూత్నంగా ఆలోచించాలె. కుటీర పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాలె. ప్రభుత్వం అందజేసిన రూ.10 లక్షల సొమ్మును రెట్టింపు చేయాలి. దళితులందరూ ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఇదే సీఎం కేసీఆర్ సంకల్పం. పథకాన్ని రాష్ట్రంలోని దళితులందరికీ వర్తింపజేస్తాం.
– కొప్పుల ఈశ్వర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి
ఇద్దరం కలిసి దళితబంధు పథకం కింద రూ.23 లక్షలతో నాన్ వోవెన్ జ్యూట్ బ్యాగుల తయారీ యంత్రాన్ని కొన్నాం. హైదరాబాద్, చెన్నై నుంచి ముడిసరుకు తెచ్చుకొంటున్నాం. ప్రస్తుతం 50 కేజీల నాన్ వోవెన్ బ్యాగులు ఉత్పత్తి చేస్తున్నాం. కేజీ బ్యాగులను రూ.180 చొప్పున విక్రయిస్తున్నాం. మా బ్యాగులకు చాలా డిమాండ్ ఉన్నది. బట్టల దుకాణ యజమానులు కూడా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. తమ దుకాణాల పేర్లను ముద్రించాలని కోరుతున్నారు. హన్మకొండ, వరంగల్లోని దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నాం. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– వేల్పుల శారద
ఇతని పేరు నీలం సతీశ్. ఊరు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూర్. ఇతనిది దళిత సమాజంలోనే అట్టడుగు సంచార వర్గం. రోడ్ల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులు, ఐరన్ బెడ్స్ వంటివి సేకరించి అమ్ముకొంటూ పొట్టపోసుకొంటుంటాడు. అత్యంత పేదరికం. అంతకు మించి ఎన్నో అవమానాలు. దళితబంధుతో ఇప్పుడు అతని జీవితం ఊహించనంతగా మారింది. తన భార్య నీలం మానసతోపాటు, గ్రామానికి చెందిన పాస్తం ముత్తమ్మకు దళితబంధు కింద మంజూరైన రూ.20 లక్షల నిధులతో శ్రీరామ ఐరన్ బెడ్స్ అండ్ ఫర్నిచర్ తయారీ యూనిట్ను నెలకొల్పాడు. ఇప్పుడు అతడు ఓ కర్మాగారానికి యజమాని. 8 మందికి ప్రత్యక్షంగా, 50 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్త.
నూతన సాంఘిక విప్లవం
దళితులను పేదరికం నుంచి దూరం చేసి, వారిని ప్రగతిపథంలో నడిపేందుకు ఇప్పటివరకు దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. దళితబంధు లబ్ధిదారులు అందరూ ఒకే ఉపాధి మార్గాన్ని ఎంచుకోకుండా తమకు ఆసక్తి ఉన్న, రాణించగల, గిట్టుబాటు అయ్యే మార్గాలపై దృష్టి సారించేలా జాగ్రత్తలు తీసుకొన్నాం. అవి సత్ఫలితాలనిస్తున్నాయి. దళితులు తాము ఉపాధి పొందడమేగాకుండా మరింత మందికి ఉపాధి కల్పిస్తుండటం గర్వకారణం. పథకంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది.
– కర్ణన్, కరీంనగర్ జిల్లా కలెక్టర్
రోజుకు 30 కేజీల జ్యూట్ బ్యాగులు అమ్ముతున్నం
ఇద్దరం కలిసి దళితబంధు పథకం కింద రూ.23 లక్షలతో ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ను ఏర్పాటు చేశాం. నాన్ వోవెన్ జ్యూట్ బ్యాగుల తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశాం. నెలకు రూ.20 వేల వేతనం ఇస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన రాజన్ అనే సాంకేతిక నిపుణుడిని నియమించుకొన్నాం. ప్యాకింగ్ తదితర వాటిల్లో సహాయం కోసం రూ.5 వేల చొప్పున ఇచ్చి ఇద్దరు మహిళలను పెట్టుకొన్నాం. హైదరాబాద్, చెన్నై నుంచి ముడిసరుకు తెచ్చుకొంటున్నాం. ప్రస్తుతం 50 కేజీల నాన్ వోవెన్ బ్యాగులు ఉత్పత్తి చేస్తున్నాం. ఒక్కోసారి 100 కేజీల వరకు ఉత్పత్తి చేస్తున్నాం. కేజీ బ్యాగులను రూ.180 చొప్పున విక్రయిస్తున్నాం. హుజూరాబాద్, జమ్మికుంటలోని కూరగాయల వ్యాపారులకే ఎకువగా బస్తాలను విక్రయిస్తున్నాం. మా బ్యాగులకు చాలా డిమాండ్ ఉన్నది. బట్టల దుకాణ యజమానులు కూడా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. తమ దుకాణాల పేర్లను ముద్రించాలని కోరుతున్నారు. బీటెక్ చేసిన శారద వాళ్ల కొడుకు నిఖిల్ ప్రైవేట్ ఉద్యోగం వదులుకొని ఇప్పుడు బ్యాగులను మారెటింగ్ చేస్తున్నాడు. హన్మకొండ, వరంగల్లోని దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నాం. ఇప్పటికే రూ.2.5 లక్షల విలువైన బ్యాగులను విక్రయించాం. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– వేల్పుల శారద, కొంకటి శ్రావ్య (హుజురాబాద్)
సారే మా పాలిట దేవుడు
మేం పడిన కష్టాలు చెప్పేతందుకు మాటలు సాలవు. ఏడ తిన్నమో. ఏడ పన్నమో. ఊరికాని ఊర్లల్లో అరిగోస పడ్డం. కేసీఆరే మా పాలిట దేవునోలె వచ్చిండు. దళితబంధు పథకం మా జీవితాలను మార్చింది. గ్రామానికి చెందిన పాస్తం ముత్తమ్మతో కలిసి శ్రీరామ ఐరన్ బెడ్స్ అండ్ ఫర్నిచర్ యూనిట్ను పెట్టుకొన్నం. మా కార్ఖానాలో 8 మంది పనిచేస్తున్నారు. ఇనుప మంచాలతోపాటు, స్టడీ కుర్చీలు, గేట్లు, ఆటో ట్రాలీ బాడీలు ఇతర ఫర్నిచర్ తయారు చేస్తున్నాం. రోజుకు 30-50 వరకు మంచాలను తయారు చేస్తున్నాం. సీజన్లో 50కి పైగా మంచాలు అమ్ముడవుతాయి. సగటున వారానికి 150 పీసుల వరకు విక్రయిస్తున్నాం. ఒక్కో ఐరన్ బెడ్ ధర మెటీరియల్ క్వాలిటీని బట్టి రూ.2,400 నుంచి 2,800 వరకు ఉంటుంది. ఖర్చులన్నీపోను చేతినిండా సంపాదన ఉన్నది. –నీలం సతీశ్ (వీణవంక)
నా కాళ్లమీద నేను నిలవడ్డ
మాది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బూజునూర్ గ్రామం. నేను చదువు పూర్తి చేసి చిన్నా చితకా పనులు చేస్తున్నా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. కేసీఆర్ సార్ దేవునోలె దళితబంధు పథకం పెట్టిండు. అమ్మ బైరుమల్ల విజయకు ఆ పథకం కింద రూ.10 లక్షలు వచ్చినయ్. ఆ పైసలతో జమ్మికుంటలో బేకరీ పెట్టిన. స్వీట్స్, కేకుల తయారు చేసేందుకు ఇద్దరు మాస్టర్లను పెట్టుకున్న. షాప్ మంచిగ నడుస్తున్నది. కిరాయిలు, కరెంటు బిల్లులు, షాపుల పనిచేసేటోళ్ల జీతాలు ఇలా ఖర్చులన్నీ పోను నెలకు రూ.30 వేలకు పైగానే మిగులుతున్నయ్. ఇంతకుముందు జీవితం ఎట్లని దినాం రందిపడేటోడిని. దళితబంధుతో నా కాళ్ల మీద నేను నిలబడ్డా. అమ్మా బాపు మస్తు సంబురపడుతున్నరు. కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటా.
– బైరుమల్ల అనిల్