హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సాక్షిగా దళిత మంత్రి, ఎమ్మెల్యేలకు ఘోర అవమానం జరిగింది. దళిత మంత్రి దామోదర రాజనర్సింహను శాసనమండలి వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా దళిత ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ వద్ద గన్మెన్లు అడ్డుకున్నారు. ఒకే వేదికపై గంటల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు జరుగడం చర్చనీయాంశమైంది. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహా ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ కలిసి శాసనమండలి కొత్త భవనంలోకి వెళ్తుండగా, అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డు చెప్పి.. ఇది సీఎం వెళ్లే దారి అని, మరోవైపు నుంచి వెళ్లాలని మంత్రికి సూచించారు.
ఊహించని ఈ పరిణామంతో ఆగ్రహం వ్యక్తంచేసిన దామోదర నర్సింహ.. ‘మంత్రిని నన్నే అడ్డుకుంటరా? మీకు రూల్స్ తెలుసా?.. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను’ అని వారిని హెచ్చరించారు. ఆ తర్వాత అదే దారి నుంచి లోపలికి వెళ్లారు. ఇదిలా ఉంటే మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి చాంబర్ వద్దకు వచ్చి లోపలికి వెళ్తుండగా భట్టి గన్మెన్లు అనుమతించలేదు. కొద్దిసేపు అక్కడే వేచిచూసినా ససేమిరా అనడంతో చేసేదేమీ లేక తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు. సీఎం చాంబర్ వద్ద కూడా ఇలాంటి ఆంక్షలు ఉండవంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా ఒకేరోజు దళిత మంత్రికి, ఎమ్మెల్యేలకు అవమానం జరుగడం తీవ్ర చర్చకు దారి తీసింది.