హైదరాబాద్, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు దళిత జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ (ఐడీజేఎన్) చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పిలుపు మేరకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకొన్నారు.
ఈసీఐఎల్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందుతోపాటు పలు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్తోపాటు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, కార్మికుల సంఘం, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ కార్మికులు, ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కూడా ఈ సంబురాల్లో పాలుపంచుకొన్నారు.