Dalit Bandhu | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకంతో దళితజాతి ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యానికి, ఆశయాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పథకం అమలవుతున్నది. దళితుల ఆర్థిక, సామాజిక జీవనంలో పెను మార్పులను తీసుకొస్తున్నది. ఈ పథకం దళితులతోపాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తున్నదని సెంటర్ ఫర్ ఎకనమిక్ సోషల్ స్టడీస్ (సెస్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
బ్యాంకు లింకేజీ లేకుండా, వందశాతం గ్రాంటుగా అర్హత గల ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించడమే లక్ష్యం కాగా 2021 ఆగస్టు 4న వాసాలమర్రి గ్రామంలో, అటు తరువాత కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా 18,025 కుటుంబాలను గుర్తించి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. లబ్ధిదారులందరూ వివిధ యూనిట్లను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో పథకం అమలు తీరు, ప్రభావాన్ని తెలుసుకొనేందుకు సెస్ ఇటీవల సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో మొత్తంగా 18,025 దళితబంధు లబ్ధిదారులున్నారు. సర్వే కోసం 16,149 యూనిట్లను సెస్ ఎంపిక చేసుకొన్నది. వీటిలో 14,879 వ్యక్తిగత యూనిట్లు కాగా, 1270 గ్రూప్ యూనిట్లున్నాయి. మొత్తం దళితబంధు లబ్ధిదారుల్లో 5 శాతం.. అంటే 807 మందిపై సెస్ ఈ సర్వేను నిర్వహించింది.
ఎంటర్ప్రైజెస్, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి పశుసంరక్షణ, తయారీ, రిటైల్, సేవలు, రవాణాకు సంబంధించి ఏడు విభాగాల్లోని యూనిట్లపై దృష్టి సారించింది. పథకానికి సంబంధించి మూడు ప్రభావాలను అంచనా వేసేందుకు అధ్యయనం చేసింది. ముడిసరుకు, ఇతర నిర్వహణ ఖర్చులతో సహా హుజురాబాద్లోని దళితబంధు యూనిట్ల వార్షిక ఇన్పుట్ ఖర్చులు, వార్షిక ఆదాయం, దళిత కుటుంబాలపై సామాజిక-ఆర్థిక ప్రభావం, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర అంశాలపై సెస్ స్టడీ చేసింది.
దళితుల జీవితాల్లో గణనీయమైన మార్పు
దళితబంధు పథకం దళితుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నట్టు సెస్ అధ్యయనం వెల్లడించింది. కోళ్ల ఫారాలు, సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, ఫొటో స్టూడియో యూనిట్లు మెరుగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించింది. దళిత పారిశ్రామికవేత్తల్లో 85 శాతం మంది తమ ఉత్పత్తులు, సేవలను నేరుగా మారెట్లోని తుది వినియోగదారులకు విక్రయిస్తున్నామని తెలిపారు. 16,149 యూనిట్ల ద్వారా దళిత కుటుంబాలకు చెందిన 19,042 మంది కుటుంబ సభ్యులతోపాటు మరో 4,372 మంది ఇతర కూలీలు ఉపాధి పొందుతున్నారని సెస్ వెల్లడించింది.
ప్రతి కూలీకి నెలకు సగటున రూ.23,656 వేతనం చెల్లిస్తున్నారని తెలిపింది. డైరీ, పౌల్ట్రీ, పేపర్ ప్లేట్ తయారీ, మినీ సూపర్ బజార్లు, కిరాణా దుకాణాలు, టెంట్హౌస్ మొదలైనవి ఒకటికంటే ఎకువ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాయని పేర్కొన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దాదాపు 70 శాతం మంది దళిత పారిశ్రామికవేత్తలు గత అనుభవం ఆధారంగానే, తమ ఉత్పత్తికి తగినంత డిమాండ్ ఉంటుందని గ్రహించి యూనిట్లను ఎంచుకున్నారని తెలిపింది.
దాదాపు సగం మంది దళిత పారిశ్రామికవేత్తలు (54,3%) తమ యూనిట్లను విస్తరించాలని భావిస్తున్నారని, కొత్త రకం ఉత్పత్తులను మారెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకొంటున్నారని సర్వేలో తేలింది. దళితబంధు పొందిన కుటుంబాల్లో 94 శాతం మంది వార్షిక గృహఆదాయం పెరిగిందని నివేదించింది. దళితబంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆశాజనకమైన, దళిత పారిశ్రామికవేత్తల విధానానికి బీజాలు పడ్డాయని సెస్ అధ్యయనం నివేదించింది.
సామాజిక మార్పులు
43.6% : ఇప్పటికే గౌరవం పొందుతున్నవారు
50.5% : ఇతరుల నమ్మకం పొందుతున్నవారు
11.5% : కొత్తగా గౌరవం పొందుతున్నవారు
12.2% : ఇప్పుడిప్పుడే నమ్మకం పొందుతున్నవారు
40% : గతంలో ఇచ్చే కంటే గౌరవమర్యాదలు పెరిగాయి
32.2% : గతంలో కంటే నమ్మకం పెరిగింది
4.9% : గౌరవం పొందని వారు
5.1% : ఇంకా ఇతరుల నమ్మకం పొందనివారు
50% : ఇతరుల సహకారం పొందుతున్నవారు
14.9 % : ఇప్పుడే కొత్తగా
30.8% : గతంలో కంటే పెరిగింది
4.3% : సహకారం పొందనివారు
60.6% : ఇతర వర్గాల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతున్నవారు
9.0% : ఇప్పుడు కొత్తగా
23.7% : ఆహ్వానాలు పెరగడం
ఆహ్వానాలు అందుకోనివారు : 6.7%
29.5% : గౌరవమర్యాదలు కొత్తగా పొందుతున్నవారు
66% : ఇప్పటికే పొందుతున్నవారు
ఇతరు సామాజికవర్గాల్లో స్నేహితులను కలిగినవారు : 63.1%
ఇప్పుడే కొత్తగా స్నేహసంబంధాలు పెంచుకుంటున్నవారు : 31.6%
ఇప్పటికే సమానత్వాన్ని పొందుతున్నవారు : 58.5%
కొత్తగా సమానత్వాన్ని పొందుతున్నవారు : 33.9%
శుభకార్యాలకు వస్తున్న ఇతర కులాల వారు : 58.7%
కొత్తగా ఇటీవల కాలంలో వస్తున్నవారు : 35.1%