హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలు చేసే దళిత బంధు పథకం.. సాధారణ కార్యక్రమం కాదని, అదొక స్ఫూరి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ‘దళితబంధు నిజం కాదా? నిజాన్ని అంగీకరించే సంస్కారం లేదా మీకు? మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా దళితబంధు ఉన్నదా? మీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దళితులకు పైసా పెట్టిందా?’ అని రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీశారు. ‘దళిత బంధు ఒక కార్యక్రమం కాదు.. ఒక స్ఫూర్తి (స్పిరిట్). చాలా మందికి చాలా విషయాలు అర్థం కావు. ఇండియా మొత్తంలో మెడికల్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా? బార్ అండ్ వైన్స్లో దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో పెడుతారా? ఆ సత్తా ఉందా మీకు? దళితులు బార్ షాపు, వైన్ షాపు ఓనర్లు అయితున్నరు. మెడికల్ షాపు, ఫర్టిలైజర్ షాపు ఓనర్లు, కాంట్రాక్టర్లు అవుతున్నరు. మీకు జీర్ణం అయితలేదా? దాని మీద కూడా కారు కూతలు కూస్తరా?’ అని మండిపడ్డారు.