రవీంద్రభారతి/న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబూ జగ్జీవన్రాం తన జీవితాన్నే అంకితం చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జగ్జీవన్రాం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. డాక్టర్ జగ్జీవన్రాం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ-2023 ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తాలో బుధవారం ఆయన హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రవీంద్రభారతిలో కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ, దేశానికి, అట్టడుగువర్గాల అభ్యున్నతికి జగ్జీవన్రామ్ చేసిన కృషిని కొనియాడారు.
కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఎకువ కాలం పనిచేసి రికార్డు సృష్టించడమేగాకుండా అంటరానితనానికి వ్యతిరేకంగా, సామాజిక సమనాత్వానికి మద్దతుగా ఆయన ఎంతో పోరాడారని స్మరించుకొన్నారు. జగ్జీవన్రాం స్ఫూర్తితో తెలంగాణలో సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు లాంటి పథకాలను తమకు ఎందుకు అమలు చేయడంలేదని దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో దళితులు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపెట్టడంతోపాటు హైదరాబాద్ నడిబొడ్డున 126 అడుగల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న సీఎం కేసీఆర్కు దళితులు రుణపడి ఉన్నారని తెలిపారు. తెలంగాణలో దళితులు, మైనార్టీ అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్నే త్యాగం చేసిన నిమ్నజాతి బిడ్డ జగ్జీవన్రాం అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. హైదరాబాద్లో 126 అడుగుల ఎత్తయిన డాక్టర్ బాబూ జగ్జీవన్రాం విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఉత్సవాల కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అలాగే, జగ్జీవన్రాంకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ వర్కింగ్ చైర్మన్లు మేడి పాపయ్య మాదిగ, జంగ శ్రీనివాస్మాల, నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్, రాష్ట్ర గ్రంథాలయ మాజీ చైర్మన్, గోషామహాల్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం శ్రీనివాస్యాదవ్, బాబూ జగ్జీవన్రాం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొమ్ముల నరేందర్, ప్రజాయుద్ధ నౌక గద్దర్, పలువురు దళిత సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.
న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో డాక్టర్ బాబూ జగ్జీవన్రాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో తెలంగాణ భవన్, రెసిడెంట్ కమిషనర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, బీబీ పాటిల్, పీ రాములు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. దేశానికే ఆదర్శనేత బాబూ జగ్జీవన్రాం అని, ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ సర్కారు నడుస్తున్నదని చెప్పారు. తెలంగాణలో దళితుల అభ్యున్నతికి సీఎం కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినట్టు చెప్పారు. ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరుపెట్టాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు. వేడుకల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.