ఆపై ఏటా 2 లక్షల మందికి అమలు
రంజాన్కు అన్ని ఏర్పాట్లు చేయాలి
సమీక్షా సమావేశంలో మంత్రి కొప్పుల
హైదరాబాద్, మార్చి 16 : దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితజాతి సముద్ధరణ కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఈ నెలాఖరులోగా 50 వేల మందికి, ఆ తర్వాత నుంచి ఏటా 2 లక్షల మంది చొప్పున మొత్తం 17 లక్షల మందికి అమలు చేయనున్నట్టు తెలిపారు. దళితులు, మైనార్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, వాటి పురోగతిపై బుధవారం ఆయన మాసబ్ట్యాంక్లోని సంక్షేమభవన్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. దళితబంధు కింద ఎక్కువ శాతం మంది ఫోర్వీలర్లకే దరఖాస్తులు పెట్టుకొంటున్నారని, హార్వెస్టర్లు, జేసీబీలు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, సరుకు రవాణా వాహనాలు కావాలని కోరుతున్నారని చెప్పారు. వాహనాలను తయారీ ధరకే అందిస్తే బాగుటుందని, ఈ అంశంపై ఆయా కంపెనీల యాజమాన్యాలతో చర్చించి 15 రోజుల్లోగా నిర్ణయానికి రావాలని అధికారులను ఆదేశించారు.
మసీదులు, ఈద్గాలకు మరమ్మతులు
రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ, సీఎం కేసీఆర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు. మసీదులు, ఈద్గాలకు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తిచేసి మౌలికవసతులన్నీ కల్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ఎండీ కరుణాకర్, జీఎం ఆనంద్కుమార్, రవాణాశాఖ కరీంనగర్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ కరీంనగర్ జిల్లా ఈడీ సురేశ్, మైనార్టీ వ్యవహరాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీనుల్ జాఫ్రీ, సయ్యద్ రియాజ్ ఉల్ హసన్, ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, మౌజంఖాన్, అహ్మద్బిన్ బలాల, అహ్మద్పాషా ఖాద్రీ, జాఫర్ హుస్సేన్ మీరాజ్, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్, డీసీపీ జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.