మహబూబాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): సమస్త జీవకోటికి పచ్చదనమే ప్రాణాధారం. ఈ సిద్ధాంతాన్ని ప్రాణప్రదం గా నమ్మిన మానుకోటకు చెందిన దైద వెంకన్న.. మొక్కలే ప్రాణంగా, పచ్చదనం పెంచటమే సంకల్పంగా జీవిస్తున్నారు. ‘మాను’ లేకుంటే మానవ మనుగడ లేదం టూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ‘ప్రజా హృదయం’ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి పచ్చదనం పెంపుపై 20 ఏండ్లుగా అలుపెరుగని ప్రచారం చేస్తున్నారు. 2015 నుంచి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో మొక్కలు నాటేందుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద వేల సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
దాతల సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి ట్రీ గార్డులను తెచ్చి మొక్కల చుట్టూ అమర్చారు. ‘ఫోన్ కొట్టు – మొక్కలు పట్టు, ఫోన్ కొట్టు – పండ్ల తోటలు పెట్టు, రాఖీ కట్టు- మొక్కలు పట్టు’ అనే పలు నినాదాలతో కార్యక్రమాలు నిర్వహించారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 5 లక్షల మొక్కలు నాటి, 6 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. దైద వెంకన్న కృషిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతి ఇచ్చి ప్రోత్సహించింది. 2018 ఆగస్టు 15న అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందులాల్, కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా చేతుల మీదుగా హరితమిత్ర అవార్డు అందుకొన్నారు. ఈ అవార్డు కింద వెంకన్నకు రూ.లక్ష అంజేశారు.\
పచ్చని చెట్లతోనే ఆరోగ్యం
ప్రతి చెట్టులో ఔషధ గుణాలుంటాయి. వాటిని కాపాడుకోవటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రతి ఇంటా మొక్కలు నాటి చెట్లను పెంచాలనేది నా లక్ష్యం. హరితహారం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 5 లక్షల మొక్కలను నాటాను. మరో 6 లక్షల మొక్క లు పంపిణీ చేశా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హరితమిత్ర అవార్డు నాలో మరింత విశ్వాసం నింపింది. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతా.
– దైద వెంకన్న,హరితమిత్ర అవార్డు గ్రహీత, మానుకోట