హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యూయల్స్లో సీజ్ చేసిన నగలు, నగదు తిరిగి అప్పగించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడి న ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ముసద్దీలాల్ జెమ్స్ ఇతర ప్రతివాదుల అభ్యర్థన మేరకు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
సుకేశ్ గుప్తా, ఎంఎంటీసీ అధికారులపై సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ జరిగిందంటూ రూ.1.7 కోట్ల నగదు, రూ.54 కోట్ల విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్స్ను సీజ్ చేసింది. గుప్తాపై నమోదైన కేసుకు ముసద్దీలాల్ కంపెనీకి, డైరెక్టర్లకు సం బంధం లేదని దాఖలైన కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈడీ కోరింది. ఇతర బోగస్ కంపెనీల్లో వీరు డైరెక్టర్లుగా ఉన్నందున అప్పీల్ పిటిషన్ను ఆమోదించాలని కోరింది.