హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సైబర్ క్రైమ్స్పై ప్రజలను ప్రభుత్వం ఎంతగా చైతన్యం చేస్తున్నా నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఆఫర్లు, క్యాష్బ్యాక్ పేరుతో క్రెడిట్, డెబిట్కార్డు వినియోగదారులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ఆయా బ్యాంకుల ప్రతినిధులుగా ఫోన్లు చేస్తూ క్రెడిట్ లిమిట్ పెంచుతామని, క్యాష్బ్యాక్ ఆఫర్ల కోసం కార్డుతో షాపింగ్ చేయాలని ఆశ పెడుతూ నిలువునా దోచేస్తున్నారు.
ఎవరైనా అనుమానించి ఆరా తీస్తే అక్షరం పొల్లుపోకుండా పూర్తివివరాలు చెప్తూ నమ్మిస్తున్నారు. వలలో పడిన వారి నుంచి దొరికినంత దండుకుంటున్నారు. చదువుకున్న వారినే సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. వివరాలన్నీ సరిగానే చెప్తుండడంతో వినియోగదారుల డాటా వారికి చేతికి ఎలా అందుతున్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు సైతం గుర్తించలేని డాటా లీకు వీరులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.
రెండు కేసుల్లో 67 కోట్లమంది ప్రజల ప్రాథమిక సమాచారాన్ని వీరు తస్కరించినట్టు గుర్తించారు. వినియోగదారుల వివరాలు ఎలా లీకయ్యాయో చెప్పాలంటూ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, పాలసీ బజార్, ఫోన్పే వంటి సంస్థలకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సైబర్ క్రిమినల్స్ను పట్టుకోవడం సవాలుగా మారడంతో ఐఐటీ కాన్పూర్కు చెందిన‘సీ3ఐహబ్’ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టూల్ను ఉపయోగించాలని రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఇదొక వర్చువల్ ఇన్వెస్టిగేటర్. ఒకే తరహా మోసాలతోపాటు బాధితులు, ఐపీ అడ్రస్లు, యూజర్, కంటెంట్ లొకేషన్ వంటివాటిని కచ్చితంగా అందిస్తుంది. దీని ఆధారంగా సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులు యోచిస్తున్నారు.