సంగారెడ్డి : తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్లైన్లో వచ్చే బిజినెస్ యాప్లను నమ్ముకుంటూ వాటి ద్వారా లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు వారు కొందరు.. మరి కొందరు ల్యాటరీ తగిలిందని గుర్తు తెలియని వ్యక్తులు పంపించే మెస్సేజ్లను గుడ్డిగా నమ్మి వాటిని ‘క్లిక్’ చేస్తూ లక్షల రూపాయలు తమ బ్యాంక్ ఖాతాలోంచి ఖాళీ చేసుకుంటున్నారు. మరికొంత మంది ఉద్యోగాలు కల్పిస్తామంటే నమ్మి నిలువునా మోసపోతున్నారు.
తాజాగా పార్ట్టైం జాబ్ ఇప్పిస్తామని చెప్పి సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్(Aminpur)కు చెందిన ముగ్గురు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు(Cybercrime) మోసం చేశారు. ముగ్గురు నుంచి రూ.78.94 లక్షలు కాజేశారు. పార్ట్టైం జాబ్ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.59 లక్షలు, టాస్క్ల పేరుతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి 19.94 లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారు. మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.