హైదరాబాద్ : ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేకంగా హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం షాద్నగర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. షాద్నగర్ మున్సిపల్ స్టేడియం నుండి 2 వేల బైక్లు పాల్గొన్న ఈ ర్యాలీని షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ డి. లావణ్య, మున్సిపల్ చైర్మన్ నాగేందర్, కౌన్సిలర్లు, తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వ్యవస్థాపకుడు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, షాద్నగర్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ కోనేటి రాజు, చీఫ్ కో ఆర్డినేటర్ జి. శ్రీనివాస్ రావు, రవి కుమార్ బిత్తిరి సత్తి, కొమురం, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానమే లక్ష్యంగా ర్యాలీని చేపట్టారు.
రోడ్డు భద్రతను తెలిపే ప్లకార్డులను వాహనదారులు ప్రదర్శించారు. షాద్నగర్ మున్సిపల్ స్టేడియం-షాద్నగర్ క్రాస్ రోడ్స్- మున్సిపల్ కమిషనర్ కార్యాలయం- లావణ్య హోటల్ యూటర్న్- హాజీపల్లి యూ టర్న్, ఇక్కడి నుంచి తిరిగి షాద్నగర్ మున్సిపల్ స్డేడియానికి ర్యాలీ చేరుకోనుంది. షాద్నగర్ ఎస్ఐ రఘు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ థీమ్ రైడ్ సేఫ్-రీచ్ సేఫ్. ఈ ఘనత సాధించడంపై తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ షాద్నగర్ ట్రాఫిక్ పీఎస్ ఎస్ఐ రఘు కుమార్కు మెమొంటోను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా బైక్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు.