హైదరాబాద్ సిటీబ్యూరో/శేరిలింగంపల్లి/బంజారాహిల్స్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): మితిమీరిన వేగంతో వెళ్లిన కారణంగా సినీనటుడు సాయిధరమ్ తేజ్ శుక్రవా రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్పోర్ట్స్ బైక్పై నిర్లక్ష్యంగా కట్, ఓవర్టేక్లూ చేస్తూ, విన్యాసాలు ప్రదర్శించడం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరిన ఆయన దుర్గంచెరువు కేబుల్బ్రిడ్జి వద్ద 100 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. అక్కడినుంచి కొద్ది దూరం వెళ్లగానే వేగం అదుపుతప్పి పడిపోయారు.
ప్రమాద స్థలంలో ఆయన 75 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్లు వెల్లడయ్యింది.ఈ బ్రిడ్జిపై గంటకు 40 కిలోమీటర్లకు మించి, యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో 30 కిలోమీటర్లకు మించిన వేగంతో వెళ్లడానికి అనుమతి లేదు. ఆయన హెల్మెట్ ధరించినప్పటికీ, స్ట్రిప్ సరిగా పెట్టుకోలేదు. ఛాతి, కాలుకు తీవ్ర గాయాలై, అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన ఒక వాహనదారుడు 108కు ఫోన్ చేసి, సమాచారం అందించాడు. 108 సిబ్బంది తొలుత ఆయనను సమీపంలోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానకు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా మెడికల్ బులెటిన్లో వైద్యులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్చరణ్ తదితరులు దవాఖానకు వెళ్లారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నటులు ప్రకాశ్రాజ్, శ్రీకాంత్, మంచు లక్ష్మి తదితరులు సాయిధరమ్ తేజ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఈ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు సెక్షన్ 336, 279, 184 మోటర్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. స్పోర్ట్స్బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, మద్యం సేవించి వాహనం నడపలేదని పేర్కొన్నారు. ఆయన ఈ బైక్ను ఎల్బీనగర్ నివాసి బుర్ర అనిల్కుమార్ నుంచి కొనుగొలు చేసినట్లు తెలుస్తున్నది. ఇంకా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. గతంలో ఈ బైక్పై మాదాపూర్లో 87 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నందుకు చలాన్ పడింది.దీనిని అకస్మాత్తుగా శనివారం చెల్లించడం గమనార్హం.