ఒక శకుని వంద శనిగ్రహాల పెట్టు అన్నట్టు.. ఒక్క సైబర్ కేటుగాడు.. వంద కోట్ల జనానికి టోపీ పెట్టగలడు. మీ వ్యక్తిగత సమాచారం, ఆదాయ వివరాలు, సంస్థల లావాదేవీలు, ప్రైవేటు, ప్రభుత్వమన్న తేడా లేకుండా అందరి, అన్ని రహస్యాలు నేడు సైబర్కేటుగాళ్ల గుప్పిట్లోకి వెళ్లాయి. రక్షణరంగ రహస్యాలతో పాటు వేటికీ నేడు భద్రత లేదు. ఎంత గోప్యంత గా ఉంచుకున్నా బూచాళ్లు పసిగట్టేస్తున్నా రు. ప్రపంచ సైబర్క్రైమ్ చరిత్రలోనే తొలిసారి అతిపెద్ద డాటాచోరీని సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. వెన్నులో వణుకుపుట్టించే ఆ డాటాచోరీ వివవరాలివే…
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): మొన్న 17 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, నేడు ఏకంగా 70 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైన ఉదంతాన్ని సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఇంత భారీస్థాయిలో వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు తదితరాలకు సంబంధించిన డాటాచోరీకి గురవడం, దానిని ఛేదించడం ప్రపంచలోనే ఇదే తొలిసారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 17 కోట్ల మంది డాటాచోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి విచారిస్తుండగానే, మరో భారీ డాటాచోరీ వెలుగులోకి వచ్చింది. దీనికి పాల్పడిన నిందితుడిని శనివారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు మొబైల్స్, రెండు ల్యాప్టాప్లు, 135 క్యాటగిరీల్లో ఉన్న అతి సున్నితమైన ప్రభుత్వ సమాచారంతో పాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పోలీసులు సీజ్చేశారు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ అదే ప్రాంతానికి చెందిన అమర్ సోహెల్, మదన్ గోపాల్ నుంచి డాటాను సేకరిస్తాడు. ఈ విధంగా సేకరించిన డాటాను సోషల్మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సైబర్ నేరస్థులకు, ఇతరులకు విక్రయిస్తున్నాడు.
ఇన్స్పైర్ వెబ్స్ ద్వారా విక్రయం
హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా నిం దితుడు ‘ఇన్స్పైర్వెబ్స్’ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన డేటాను క్లౌడ్ డ్రైవ్ లింకుల ద్వారా విక్రయిస్తున్నట్టు పోలీసులు పసిగట్టారు.
4.5 లక్షల మంది ఉద్యోగుల డాటా
గుజరాత్ సహా మొత్తం 6 మెట్రోపాలిటన్ నగరాలకు చెందిన 4.5 లక్షల మంది ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన డాటాను నిందితుడు సేకరించాడని, అందులో డిఫెన్స్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన ఉద్యోగులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ సర్వీసెస్, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ట్రూ-కాలర్, టెలికామ్ డాటా, ట్రేడింగ్ అండ్ స్టాక్ బ్రోకింగ్ తదితర సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
24రాష్ర్టాలు, 8 మెట్రోనగరాలకు చెందిన డాటా చోరీ
దేశంలోని 24రాష్ర్టాల్లో 104 క్యాటగిరీలకు సంబంధించిన డాటా, 8 మెట్రోసిటీలలో 44 క్యాటగిరీలకు చెందిన డాటాను నిందితుడు సేకరించడం, తస్కరించడం, నిల్వచేసుకుని సైబర్ నేరస్థులు, ఇతరులకు విక్రయిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. చోరీకి గురైన ఈ 70 కోట్ల మంది డాటాలో 24రాష్ర్టాలు, 8 మెట్రానగరాలకు చెందిన 51.9 కోట్ల మంది వ్యక్తులు, సంస్థలతో పాటు డిఫెన్స్కు చెందిన వారి వివరాలు, ప్రభుత్వ ఉద్యోగులు, పాన్కార్డు దారులు, 10, 11, 12వ తరగతి విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, ఢిల్లీలో విద్యుత్ వినియోగదారులు, డీ-మార్ట్ ఖాతాదారులు, పలువురి వ్యక్తిగత ఫోన్నెంబర్లు, నీట్ విద్యార్థులు, వీవీఐపీలు, ఇన్సూరెన్స్ కలిగిన వారు, క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
ప్రపంచలోనే ఇది మొదటి కేసు
డాటాచోరీ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది. విశ్వసనీయ సమాచారం మేరకు 70 కోట్ల మందికి సంబంధించిన డాటాచోరీ కేసును ఛేదించాం. నిందితుడికి సహకరిస్తున్న సంస్థలు, వ్యక్తుల వివరాలపై ఆరా తీస్తున్నాం. డాటా చోరీ చాలా ప్రమాదకరమైన నేరం. ఇది సైబర్క్రైమ్ నేరాలకు ఆజ్యం పోస్తున్నది. ప్రజలు, వ్యవస్థలు, సంస్థలు అప్రమత్తంగా ఉండాలి. మన కంప్యూటర్లు మన వద్దనే ఉంటాయి. మన సెల్ఫోన్లు మన వద్దనే ఉంటాయి. కానీ మన డాటా వేరేవారి గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి కేసును ఛేదించడం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. ప్రపంచంలోనే ఇది మొదటి కేసుగా చెప్పవచ్చు.
– సీపీ స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీస్ కమిషనర్