తెలంగాణ పోలీస్.. ఈ పేరు వింటేనే ఎలాంటి నేరస్తులకైనా వెన్నులో వణుకు పుడుతుంది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఎలాంటి నేరాన్నైనా ఇట్టే కట్టడి చేయడంలో దిట్ట అనిపించుకుంటున్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్లోనే కాదు ఫ్రాడ్స్టర్ల పట్ల సింహస్వప్నంలా మారింది మన పోలీస్ వ్యవస్థ. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటేనే భయపడే జనం ప్రత్యేక రాష్ట్రంలో పోలీసుల పనితీరుకు ఫిదా అవుతున్నారు. నేరాలను నివారించడంలోనే కాదు, నేరస్తుల ఆటకట్టించడంలోనూ, బాధితులకు భరోసానివ్వడంలోనూ ముందువరుసలో నిలుస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆటకట్టించి రూ.41 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. ఇంతమొత్తాన్ని ఫ్రీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. చేవెళ్లకు చెందిన ఓ రైతు కుటుంబం ఆన్లైన్ మోసానికి గురై రూ.98.50 లక్షలు పోగొట్టుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
పలు అకౌంట్లలో ఉన్న రూ.41 కోట్ల మొత్తాన్ని పోలీసులు ఫ్రీజ్ చేశారు. డిసెంబర్ నెలలో షాబాద్ మండలానికి చెందిన ఓ రైతు కుటుంబానికి సంబంధించిన భూమిని ప్రభుత్వం అభివృద్ధి నిమిత్తం తీసుకున్నది. ఇందుకుగాను ఆ కుటుంబానికి రూ. 1.1 కోట్ల పరిహారం చెల్లించగా ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో దాచారు. డిగ్రీ చదువుతున్న ఆ రైతు కొడుకు హర్షవర్ధన్రెడ్డి కింగ్ 567 అనే ఆన్లైన్ గేమ్కు ఆకర్షితుడై రూ.98.50 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయినట్టు తెలుసుకున్న ఆ రైతు కుటుంబం సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఢిల్లీ, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, బెంగుళూరు రాష్ర్టాల్లో విస్తృతంగా గాలించి సైబర్ మోసగాళ్ళ ఆటకట్టించారు.
బెంగుళూరుకు చెందిన మొహిన్ పాషా, ఉత్తరాఖండ్కు చెందిన కరన్ అరోరా, సంజీవ్కుమార్, గోకుల్ సింగ్ కోరంగ, దినేష్ సింగ్, ఢిల్లీకి చెందిన కరణ్ మల్హోత్రా, సోను లోకేశ్, మొహిత్కుమార్లను అరెస్ట్ చేయడంతో భారీ రాకెట్టు వెలుగుచూసింది. ఈ ముఠాకు చెందిన 416 బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అందులో రూ.41 కోట్ల నగదు ఉన్నదని గుర్తించారు. దీంతోపాటు ఉద్యోగాలిప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఉత్తర్ప్రదేశ్కు చెందిన సన్నీకుమార్తో పాటు అర్జున్సింగ్, రుచి భారతి, షావిపాల్, శాంతి, మీనా రాజ్పుత్ సభ్యులుగా గల మహిళా గ్యాంగ్ను కూడా అరెస్ట్ చేశారు. మరో సంఘటనలో రుణాలిప్పిస్తామంటూ మోసగిస్తున్న సుభాష్కుమార్, శ్రీకాంత్కుమార్, అమిత్కుమార్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సైబరాబాద్లో పది మందిని మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఆన్లైన్ గేమ్లు నిషేధించినా ఆగని నేరాలు
ఆన్లైన్ ప్లాట్ఫామ్స్పై గ్యాంబ్లింగ్ గేమ్స్కు సంబంధించిన ప్రకటనలను 2017లోనే తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. అయినా సైబర్ నేరగాళ్లు అమాయకులకు వివిధ రకాలుగా వలలు విసురుతున్నారు. ఇలా వారి బారిన పడిన వాళ్ళలో ఓ కాంట్రాక్టర్ కొడుకు, ఓ ప్రైవేట్ ఉద్యోగి కొడుకు, ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరే కాక ఓ పోలీసు అధికారి కొడుకు కూడా ఉన్నాడు. వీరంతా లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు సైబర్ ముఠాను పట్టుకుని భారీ ఎత్తున నగదును ఫ్రీజ్ చేయడంతో తాము పోగొట్టుకున్న సొమ్ము తిరిగి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల చొరవకు హ్యాట్సాప్
సైబర్ మోసగాళ్ళ ఆటకట్టించడంలో సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చొరవకు హ్యాట్పాప్. నెల రోజుల క్రితం మా సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి ఆన్లైన్ మోసానికి గురై రూ.98.50 లక్షలు పోగొట్టుకున్నాడు. దీనిపై సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మమ్మల్ని పిలిచినప్పుడల్లా పోలీస్ స్టేషన్కు వెళ్ళాం. వాళ్ల నుంచి మాకు మంచి స్పందన లభించింది. మా కేసు విషయంలో ప్రత్యేకంగా విచారణ చేపట్టిన పోలీసులకు ధన్యవాదాలు.
– బాధితుడి సోదరుడు శ్రీపాల్రెడ్డి, చేవెళ్ల