హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ గాగుల్స్ లాంటి వేరబుల్ డివైజ్లు ఇప్పుడు కొత్త ఫ్యాషన్గా మారాయి. యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది వీటిని వినియోగిస్తున్నారు. ఇలాంటి వారికి సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉన్నదని, హ్యాకర్లకు వేరబుల్ డివైజ్లు బ్రహ్మాస్త్రంలా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం హెల్త్ ట్రాకింగ్ అంశాలనే అస్ర్తాలుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఇప్పటికే వివిధ దేశాల్లో 10 మంది ప్రాణాలను హరించినట్టు చెప్తున్నారు. మన దేశంలో ఈ తరహా కేసులు ఇంకా వెలుగులోకి రాకపోయినప్పటికీ స్మార్ట్ గ్యాడ్జెట్ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు. శరీరానికి అనుసంధానమై ఉండే డివైజెస్ నుంచి గుర్తించదగిన వ్యక్తిగత సమాచారాన్ని (పర్సనల్ ఐడెంటిఫయబుల్ ఇన్ఫర్మేషన్ను) దొంగలించేందుకు, డివైజ్కు కనెక్ట్ చేసి ఉన్న అప్లికేషన్ లేదా, డివైజ్ క్లౌడ్ డాటాబేస్పై దాడి చేసేందుకు అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుతం ఎన్క్రిప్టెడ్ డాటాను సైతం దొంగలించగలిగే హ్యాకింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున వేరబుల్ డివైజ్ డేటా బ్రీచింగ్ సులభమేనని స్పష్టం చేస్తున్నారు.
యాప్స్ కీలకం
డివైజ్లకు అనుసంధానమైన యాప్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. వేరబుల్ డివైజ్ సేకరించిన డాటాను ప్రత్యేక యాప్స్లో నిక్షిప్తం చేసి ఉంచుతాయి. వాటి నుంచి డాటాను దొంగలించేందుకు వీలుంటుంది. యాప్ డెవలపర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ సైబర్ నేరగాళ్లు డాటాను హ్యాక్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీల డివైజ్లు డాటా స్టోరేజీ విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఇతర ఫిషింగ్ లింక్స్ ద్వారా సమాచారం బట్టబయలైన సందర్భాలు లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఫీచర్లుండే ఉబర్ క్లౌడ్ డాటాను సైతం ఎక్స్టర్ననల్ లింక్స్ ద్వారా దొంగలించిన ఉదంతాలున్నాయని, దీన్ని బట్టి చూస్తే వేరబుల్ డివైజ్లో డాటా సురక్షితంగా ఉండటం అసాధ్యమేనని అంటున్నారు.
వేరబుల్ డివైజ్ హ్యాకింగ్ సులభమే
వేరబుల్ డివైజ్ల నుంచి డాటాను హ్యాక్ చేయడం సులభమే. పర్సనల్ ఐడెంటిఫయబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు సహా ప్రముఖులపై సైబర్ నేరగాళ్లు దాడిచేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొన్న లోన్ యాప్స్ కాల్ లిస్ట్, కాంటాక్ట్స్ ఆధారంగా సైబర్ నేరగాళ్లు వేధింపులకు పాల్పడుతున్నట్టుగానే వేరబుల్ డివైజ్ నుంచి తస్కరించిన హెల్త్ డాటానూ దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్నది. – ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ నిపుణుడు
నిబంధనలపై అవగాహన తక్కువే
గ్యాడ్జెట్లలో యాప్లను ఇన్స్టాల్ చేసుకొనేటప్పుడు సంబంధిత నియమనిబంధనల (టర్మ్స్ అండ్ కండిషన్స్)ను చాలా మంది పరిశీలించరు. టెక్ నిపుణులకు మినహా సాధారణ గ్యాడ్జెట్ యూజర్లకు వాటిపై అవగాహన ఉండదు. దీంతో ఆయా నిబంధనల ప్రకారం సదరు యాప్ సంస్థలు అధికారికంగానే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకొంటాయి. అంతేకాకుండా యూజర్ల డివైజ్ల నుంచి సేకరించిన కాంటాక్ట్ నంబర్లు, కాల్ రికార్డులు, మెసేజ్లు, సోషల్ మీడియా ఫీడింగ్, లొకేషన్, బయో మెట్రిక్స్, ఆరోగ్య వివరాల్లాంటి వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్ పార్టీలకు బదిలీ చేసేందుకూ వీలుంటుంది. ఇలాంటి డాటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు. ఆ సమాచారాన్ని అస్త్రంగా చేసుకొని జనాన్ని మానసికంగా, వ్యక్తిగతంగా వేధించడం మొదలుపెడతారు. ఇలాంటి వేధింపులకు తాళలేక గత ఐదేండ్లలో అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.