హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): మీ మొబైల్ పనిచేయడం లేదా? రిపేర్కు ఇస్తున్నారా? అయితే జాగ్రత! ఇప్పుడే కాదు.. మరమ్మతుచేయడానికి మూడు నాలుగు రోజులు పడుతుందని చెప్తున్నారా? అయితే మరీ జాగ్రత్త!! ఎందుకంటే, కొంతమంది మొబైల్ రిపేర్సెంటర్ల నిర్వాహకులు నేరగాళ్ల అవతారం ఎత్తారు. మరమ్మతుల కోసం వచ్చిన ఫోన్లోని డాటాను, ఫొటోలను తస్కరించి, బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, తమ ‘కోరికలు’ తీర్చాలని వేధిస్తున్నారు. తాము చెప్పింది చేయకపోతే మీ వ్యక్తిగత సమాచారాన్ని (ఫొటోలు, వీడియోలు, చాటింగ్) సోషల్ మీడియాలో పెట్టి, పరువు తీస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇలా వేధింపులకు గురవుతున్నవారి సంఖ్య వేలల్లో ఉన్నదంటే ఆశ్చర్యపోకండి.
ఇటీవల సైబర్ క్రైం పోలీసులు, సైబర్ నిపుణుల వద్దకు ఇలాంటి ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి. ‘మా ఫొటోలు, వీడియోలు, చాటింగ్లు గుర్తుతెలియని వ్యక్తులకు తెలిసిపోతున్నాయి. వాటితో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డబ్బు డిమాండ్ చేస్తున్నారు. సాధ్యం కాని కోరికలు తీర్చాలని వేధిస్తున్నారు. అసలు మా వ్యక్తిగత సమాచారం వారి దగ్గరకు ఎలా వెళ్తున్నది’ అనే అనుమానాలు వ్యక్తంచేస్తూ.. అనేకమంది మౌఖిక ఫిర్యాదులు చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా బాధితులను విచారించినప్పుడు చాలామంది తమ ఫోన్లను ప్రైవేటు మొబైల్ రిపేరింగ్ దుకాణదారుల వద్ద రిపేర్కు ఇచ్చినట్లు తేలింది.
ఒక వ్యక్తి తన మొబైల్ మరమ్మతు కోసం దుకాణానికి వెళ్లారు. దాని రిపేర్కు 4 గంటల నుంచి రెండు రోజుల దాకా పడుతుందని మెకానిక్ చెప్పాడు. అలా సెల్ఫోన్ తీసుకొన్న ఆ మెకానిక్ అందులోని డాటాను, అప్పటికే తొలగించిన సమాచారాన్ని సైతం సాంకేతిక పరిజ్ఞానంతో చోరీ చేశాడు. 7,8 నెలల తర్వాత బాధితులకు ఫోన్చేసి, బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు. ఇటీవల కొంతమంది పోలీస్ అధికారులు సైతం బాధితులుగా మారినట్టు తెలుస్తున్నది.