హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మార్ఫింగ్ ఫొటోలతో దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, మహిళలతోపాటు ఇతరులపై సోషల్మీడియాలో అసభ్యకరమైన పోస్టింగులు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త కనుగోలు సునీల్కు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించారు. సునీల్ తరపున ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి నోటీసులు అందుకున్నట్టు సైబర్క్రైమ్ పోలీసులు తెలిపారు. మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ పేరుతో మాదాపూర్లో సునీల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్మీడియా విభాగం నిర్వహిస్తున్నాడు.
తెలంగాణ గళం పేరుతో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లో మార్ఫింగ్తో కూడిన అసభ్యకరమైన వీడియోలు సోషల్మీడియాలో పోస్టయ్యాయి. ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులపై మార్ఫింగ్ వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సైబర్క్రైమ్ ఠాణాతోపాటు చాంద్రాయణగుట్ట, రాంగోపాల్పేట్, అంబర్పేట పోలీస్స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. నకిలీ పేర్లు, నకిలీ ఐపీ అడ్రస్లతో ఈ పోస్టులు సోషల్ మీడియాలోకి వచ్చాయి. దీనిపై సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఐపీ అడ్రస్ చిరునామాలో పోలీసుల సోదాలు
సైబర్క్రైమ్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ టూల్స్ను ఉపయోగించి ఈ నెల 13న ఆ ఐపీ అడ్రస్ చిరునామాను వెతుకుతూ మాదాపూర్కు వెళ్లారు. మాదాపూర్లో మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ సంస్థ నుంచి ఆ వీడియోలు పోస్టు అయినట్టు నిర్ధారించుకొని సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్మీడియా కార్యాలయమంటూ పోలీసుల సోదాలను అడ్డుకున్నారు. ఒక జాతీయ పార్టీ కార్యాలయం అని సూచించే బోర్డు లేదని, వేరే కంపెనీ పేరుతో నిర్వహిస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పేరు, ఊరు తెలియకుండా నకిలీ ఐపీలతో పోస్టు చేస్తున్నారని, ఇది నేరమని సైబర్క్రైమ్ పోలీసులు వాదించారు.
అక్కడ పనిచేస్తున్న మంద శ్రీ ప్రతాప్, శశాంక్, ఇషాన్, శర్మలను అదుపులోకి తీసుకొని వారికి 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. కార్యాలయం నుంచి ఫోన్లు, ల్యాప్టాప్లు పోలీసులు స్వాధీనం చేసుకొని విశ్లేషణ చేశారు. ఈ సంస్థను నిర్వహిస్తున్న ఢిల్లీకి చెందిన సునీల్ కనుగోలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మంగళవారం మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. సునీల్ కార్యాలయంలో లేకపోవడంతో అతడి తరపున నోటీసులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి అందుకున్నారు.