Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదరణ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల చేరికలు అంటూ ఎంత హడావుడి చేసినా పెద్దగా ప్రభావం చూపడం లేదు. రాష్ట్ర పార్టీలో అద్భుతం జరుగుతన్నదంటూ ఇక్కడి నేతలు చెప్తున్నవన్నీ గప్పాలేనని ఢిల్లీ పెద్దలు గుర్తించారు. సోషల్ మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో పార్టీకి ఏమాత్రం ఆదరణ పెరుగడంలేదని వారు నిర్వహించిన సర్వేల్లో తేలింది. దీంతో తెలంగాణలో ఎలాగైనా ఆదరణ పెంచుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం నానా పాట్లు పడుతున్నది. ఇప్పటికే రాహుల్గాంధీ రెండుమూడు సార్లు తెలంగాణలో పర్యటించారు. అయినా పాలపొంగు మాదిరిగా అప్పటికప్పుడు హడావుడి తప్ప పెద్దగా ప్రయోజనం కలుగలేదని తేలింది.
సోనియాగాంధీ నేరుగా దృష్టిపెడతారని, ప్రియాంక వాద్రా వస్తారని.. ఇలా రకరకాల లీకులతో ప్రజల నోట్లో నానేందుకు ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. కనీసం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరుకని పరిస్థితి. చోటామోటా పార్టీలతో పొత్తుకూడినా ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో ఏకంగా సీడబ్ల్యూసీ సమావేశాలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల వంకతో సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లిఖార్జున ఖర్గే.. ఇలా కాంగ్రెస్లో పేరున్న నేతలంతా తెలంగాణపై దండెత్తనున్నారు. సాధారణంగా సీడబ్ల్యూసీ సమావేశాలు ఢిల్లీలోనే నిర్వహిస్తుంటారు. కాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారిగా ఢిల్లీ దాటి హైదరాబాద్ను వేదికగా ఎంచుకున్నారు. ఇది దింపుడు కల్లం ఆశేనని రాజకీయ విశ్లషకులు అంటున్నారు.
అసలే ఆదరణలేని కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం వంటి పరిణామాలను చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని చెప్తున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కొక్కరిని ఒక్కోసారి రాష్ట్రంలో పర్యటించేలా చేస్తూ హడావుడి చేస్తాయని, కాంగ్రెస్ మాత్రం ముఖ్య నేతలందరినీ ఒకేసారి తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నదని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ చివరి అస్త్రం ఇదేనని చెప్తున్నారు. అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం కష్టమేనని స్పష్టం చేస్తున్నారు. 17న నిర్వహించే బహిరంగ సభలో ఎలాగూ అలవికాని హామీలు ఇస్తారని అంచనా వేస్తున్నారు.