హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించిన 45టీఎంసీలపై వివరాలు ఇవ్వాలని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ర్టాన్ని కోరింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా బేసిన్లో మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు కేటాయించిన 90 టీఎంసీలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో 45 టీఎంసీలు ఆదా కాగా.. ప్రభుత్వం వాటిని పాలమూరు రంగారెడ్డి పథకానికి కేటాయించింది. ఈ నేపథ్యంలో 2012-13 నుంచి 2021-23 వరకు ఏ విధంగా నీటిని పొదుపు చేశారో తెలుపాలని సీడబ్ల్యూసీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలు అందించి, నీటి కేటాయింపుపై సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇస్తే 45 టీఎంసీలతో పాలమూరు డీపీఆర్కు ఆమోదం లభించే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు సమ్మక బరాజ్ నిర్మాణానికి ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ)పైనా సీడబ్ల్యూసీ ఆరా తీసింది. ఈ బరాజ్ నుంచి దేవాదుల ఎత్తిపోతలకు 38 టీఎంసీలు, శ్రీరాంసాగర్ రెండో దశకు 47 టీఎంసీలు తరలించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. ఈ నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ వివరాలు కోరింది. దీంతోపాటు సీతారామ ఎత్తిపోతల పథకం కింద సాగుపైనా సీడబ్ల్యూసీ ఆరా తీసింది. ఒక్కో హెక్టారుకు 79.07 క్వింటాళ్ల వడ్లు లేదా 49.42 క్వింటాళ్ల పత్తి, 69.19 క్వింటాళ్ల మకజొన్న పండుతుందని డీపీఆర్లో పేర్కొన్నది. ఈ దిగుబడి ఎలా సాధ్యమో చెప్పాలని సూచించింది.