హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అకాల మరణంతో ఖాళీగా ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) పోస్టును భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కొనసాగుతున్నందున ఆ పోస్టుకు ఇన్చార్జి అధికారిని నియమించనున్నట్టు సమాచారం. గతంలో ఈ పోస్టుకు ఏసీబీ డీజీ ఇన్చార్జిగా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ డీజీగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఇన్చార్జిగా నియమించనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువనున్నట్టు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిశాక పూర్తిస్థాయి డీజీని నియమించనున్నారు. డీజీపీ లేదా అడిషనల్ డీజీపీ ర్యాంకు అధికారిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి డీజీగా నియమిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ముగ్గురు ఏడీజీల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరిలో అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి, రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ డీజీ మహేశ్ భగవత్, తెలంగాణ స్పెషల్ పోలీస్ డీజీ స్వాతిలక్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరో ఇద్దరు ఏడీజీల పేర్లు, వారి ట్రాక్ రికార్డుపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలిసింది. విజిలెన్స్ డీజీగా రాజీవ్ రతన్ బాధ్యతలు చేపట్టగానే మేడిగడ్డ ప్రాజెక్టులో అధికారుల అవకతవకలపై లోతుగా విచారణ జరిపి ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేశారు. దీనితోపాటు సచివాలయంలో ఐటీ ప్రొక్యూర్మెంట్, నారాయణ పేట వైద్య కళాశాల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, కంకర మిల్లుల నిబంధనల ఉల్లంఘన తదితర కేసులను రాజీవ్ రతన్ డీల్ చేశారు. అనతికాలంలోనే ఆ కేసులపై పట్టు సాధించారు. దీంతో ఆ స్థాయి లో నిబద్ధత కలిగిన, సమర్థుడైన అధికారిని విజిలెన్స్ డీజీగా నియమించేందుకు ప్రభుత్వం అన్వేషణ మొదలుపెట్టింది.