TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో గురువారం కీలక విషయం బయటపడింది. గ్రూప్-1 సహా ఆరు పరీక్షలకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్షీట్లను కూడా కాపీ చేసుకున్నట్టు సిట్ విచారణలో నిందితులు వెల్లడించినట్టు తెలిసింది. ప్రశ్నలతోపాటు సమాధానాలను కూడా మిగతా నిందితులకు ఇవ్వడంతో గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి వారే పరీక్షలకు సిద్ధమైనట్టు వెల్లడైంది. కస్టోడియన్ సిస్టమ్ నుంచి ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ఆరు పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్నపత్రాలను, వాటి సమాధానాలను కాపీ చేసుకున్నారు. ఆయా పరీక్షలకు వారం రోజుల ముందే తమ వారికి ప్రశ్నపత్రం అందేలా ప్లాన్ చేసుకున్నారు.
గ్రూప్-1లో వందకుపైగా మార్కులు తెచ్చుకున్న సురేశ్, రమేశ్, షమీమ్కు పరీక్షకు వారం రోజుల ముందు ప్రశ్నపత్రం అందించినట్టు విచారణలో వెల్లడించారు. ఈ ముగ్గురిని ఐదురోజుల కస్టడీకి తీసుకున్న సిట్ రెండోరోజు గురువారం విచారించింది. నిందితుల ఇండ్లలో సిట్ సోదాలు నిర్వహించింది. పరీక్షకు సిద్ధమైన ప్రశ్నపత్రాలు, సమాధానాల కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురు మూడు జిరాక్స్ కాపీలు తీసుకొని, సమాధానాలు కూడా అక్కడే ఉండటంతో ఆయా ప్రశ్నలను బట్టి పట్టినట్టు సిట్ విచారణలోతెలిసింది. నిందితులు చెప్పే అంశాలను ధ్రువీకరించుకోవడానికి కస్టోడియన్ శంకర లక్ష్మిని కూడా సిట్ విచారించింది.
కస్టోడియన్ సిస్టమ్ నుంచి గ్రూప్-1తోపాటు మరో ఐదు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు నిందితులు కాపీ చేసుకున్నారు. గ్రూప్-1, ఏఈ (6), ఏఈఈ (3), టౌన్ప్ల్లానింగ్(2), డీఏవో(2)తోపాటు జూనియర్ లెక్చరర్ పరీక్ష ప్రశ్నపత్రాలు, వాటి సమాధాలున్నాయి. గ్రూప్-1 అక్టోబర్ మొదటివారంలో కాపీ చేసుకోగా, మిగతా పరీక్షలవి ఫిబ్రవరి 27న ప్రధాన నిందితులు కాపీ చేసుకున్నట్టు విచారణలో తేలింది. ప్రధాన నిందితులు చెప్పిన విషయాలు, వారి వద్ద పేపర్ తీసుకొని పరీక్ష రాసిన నిందితులు టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి సైదాబాద్కు చెందిన సురేశ్, కంప్యూటర్ అపరేటర్గా పనిచేసిన ఉప్పల్కు చెందిన రమేశ్, ఏఎస్వోగా పనిచేసిన ఎల్బీనగర్కు చెందిన షమీమ్ వద్ద సమాచారాన్ని సిట్ సేకరిస్తున్నది. ఇద్దరు ప్రధాన నిందితులు, ఈ ముగ్గురు మాజీ ఉద్యోగులు చెప్పిన అంశాలను సిట్ నిర్ధారించుకుంటున్నది.
కస్టోడియన్ శంకరలక్ష్మితోపాటు కస్టడీలో ఉన్న సురేశ్, రమేశ్, షమీమ్ను ఒకే దగ్గర కూర్చొబెట్టి గురువారం సిట్ పలు అంశాలపై ప్రశ్నించింది. ఎప్పుడైనా ఈ ముగ్గురు అనుమానాస్పదంగా వ్యవహరించారా? ఉద్యోగ సమయంలో వాళ్ల ప్రవర్తన ఎలా ఉండేది? వీళ్లతోపాటు పరీక్ష రాసిన టీఎస్పీఎస్సీలోని మిగతా ఉద్యోగులతో ఈ ముగ్గురికి ఎలాంటి స్నేహ సంబంధాలున్నాయనే విషయాలను సిట్ వారి వద్ద నుంచి సేకరించింది. నిందితుల కాంటాక్టు లింక్లు, సిట్కు ఈ ముఠాపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడంలో భాగంగా శంకరలక్ష్మి నుంచి పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టారు. నిందితులు చెప్పేది ఎంత వరకు నిజమనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి పరీక్ష పత్రం వీళ్ల చేతికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడారు అనే విషయాలను, వాళ్ల వాట్సాప్, కాల్ డాటాను సిట్ అధికారులు విశ్లేషిస్తున్నారు.