హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నర్సుల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం కల్పించిన ‘ఆఫీసర్’ హోదా ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. దాదాపు మూడు నెలలుగా జీవోలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొత్త ఏడాదిలో అయినా తీపి కబురు చెప్పాలని నర్సులు కోరుతున్నారు. వృత్తికి మరింత గౌరవం కల్పించేలా తమ హోదాను ‘నర్సింగ్ ఆఫీసర్’గా మార్చాలంటూ నర్సులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం వారి కలను సాకారం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరిస్తూ గత ఏడాది అక్టోబర్ 6న ఉత్తర్వులు జారీ చేసింది. స్టాఫ్ నర్స్ను ‘నర్సింగ్ ఆఫీసర్’గా, హెడ్ నర్స్ను ‘సీనియర్ నర్సింగ్ ఆఫీసర్’గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను ‘డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్’గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను ‘చీఫ్ నర్సింగ్ ఆఫీసర్’గా, పబ్లిక్ హెల్త్ విభాగంలోని దవాఖానల్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్స్లను ‘పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్’గా మార్చింది.
వైద్యారోగ్య శాఖతోపాటు ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి దీనిని వర్తింపజేసింది. ఈ హోదా మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని ఆ జీవోల్లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 14 వేల మంది నర్సులు సంతోషం వ్యక్తంచేశారు. తమకు సమాజంలో మరింత గౌరవం పెరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే చేతికందిన ముద్ద నోటికాడిదాకా రానట్టు మూడు నెలలు గడిచినా ఇంకా సర్వీస్ రికార్డుల్లోగానీ, వేతన రసీదుల్లో (పే స్లిప్లో) గానీ ఇంకా హోదా మారలేదు. జీవోలు విడుదలైన మూడు రోజులకే ఎన్నికల కోడ్ రావడంతో మిగితా ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ‘నర్సింగ్ ఆఫీసర్’ ఇంకా జీవోలకే పరిమితమైంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ సమస్యపై దృష్టిసారించాలని, వెంటనే హోదాను మార్చాలని నర్సులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం వైద్యారోగ్యశాఖలో కొత్తగా 7,094 పోస్టుల భర్తీ జరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 9 విభాగాల్లో 5,204 స్టాఫ్నర్స్ పోస్టులకు ప్రభుత్వం 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మరో 1890 పోస్టులను ప్రభుత్వం జత చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగింది. ఇటీవలే ఫలితాలు వెల్లడించారు. ప్రాథమిక తుది జాబితాను నేడోరేపో విడుదల చేయనున్నారు. వీరికి పోస్టింగ్ ఇచ్చే సమయంలోనే ‘నర్సింగ్ ఆఫీసర్’గా పేర్కొనాలని నర్సులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.