హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు 63.79 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇది రెండో అత్యధిక సాగు కావడం గమనార్హం. 2020 యాసంగిలో అత్యధికంగా 68.16 లక్షల ఎకరాల్లో పంటల సాగు నమోదైంది. అదే ఏడాది అత్యధికంగా 52.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
ఈసారి ఇప్పటికే 45 లక్షల ఎకరాల్లో వరి సాగు కావడం గమనార్హం. పాత రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉన్నది. మక్కజొన్న 5.97 లక్షల ఎకరాల్లో, జొన్న 1.07 లక్షలు, శనగ 3.56 లక్షలు, మినుము 45 వేలు, వేరుశనగ 2.38 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.