హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పప్పు పంటల సాగు, ఉత్పత్తి క్రమంగా పెరుగుతున్నది. స్వరాష్ట్ర ఏర్పాటు నాటితో పోల్చితే ప్రస్తుతం ఈ పంటల సాగు విస్తీర్ణం దాదాపు 50% పెరిగింది. పప్పుల ఉత్పిత్తి రెట్టింపు కంటే అధికమైంది. జాతీయ మార్కెట్లో పప్పులకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఈ పంటలను సాగుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నది. దీనికితోడు రాష్ట్రంలో సాగునీరు విస్తారంగా అందుబాటులోకి రావడంతో రైతులు జోరుగా పప్పు పంటలను సాగు చేస్తున్నారు. ఫలితంగా 2014-15 నాటికి తెలంగాణలో 10.07 లక్షల ఎకరాలుగా ఉన్న పప్పు పంటల సాగు విస్తీర్ణం.. 2020-21 నాటికి మరో 4.54 లక్షల ఎకరాలు పెరిగి ఏకంగా 14.62 లక్షల ఎకరాలకు చేరింది. ఇదే కాలంలో అన్ని రకాల పప్పుల ఉత్పత్తి 2.63 లక్షల టన్నుల నుంచి 5.90 లక్షల టన్నులకు పెరిగింది.
మద్దతుకు మించి ధర
దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పప్పుల వినియోగం పెరుగుతుంటే.. ఉత్పత్తి మాత్రం తగ్గుతున్నది. దాంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పప్పులకు భారీ డిమాండ్ ఏర్పడటంతో వాటి సాగుదార్లకు మద్దతుకు మిం చిన ధర లభిస్తున్నది. ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా ప్రైవేటు వ్యాపారులే నేరుగా రైతుల వద్దకు వచ్చి పప్పు దిగుబడులను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పంటల కొనుగోలుకు వ్యాపారులు ముందుగానే రైతులతో ఒప్పందాలను కుదుర్చుకొంటున్నారు. దీంతో ఈ ఏడాది క్వింటాల్ కందులకు రూ.6,600, పెసలకు రూ.7,755, మినుములకు రూ.6,600 మద్దతు ధర ఉన్నది.