ICRISAT | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): వేసవి తీవ్రత నానాటికీ అధికమవుతుండటంతో ప్రస్తుతం ఎన్నో ప్రాంతాలు నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్నాయి. ఇలాంటి కరువు పరిస్థితుల్లోనూ రైతులు కంది సాగుతో అధిక దిగుబడి పొందవచ్చని ఇక్రిశాట్ పరిశోధకులు చెప్తున్నారు. ఏడాదిలో మొత్తంగా 65 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ కంది సాగు చేపట్టవచ్చని స్పష్టం చేస్తున్నారు.
కందులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఇక్రిశాట్ ఇప్పటికే పలు రకాల వంగడాలను అభివృద్ధి చేసింది. వాటిలో కొన్ని రకాల వంగడాలకు వర్షాభావం, నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత తదితర ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఉండటంతో ఇప్పటికే ఎన్నో దేశాల్లో సాగు చేస్తున్నారు. నీటి అవసరం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండే ఇలాంటి రకాల సాగుతో రైతులకు ఆదాయంతోపాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధకులు చెప్తున్నారు. అధిక పోషకాలు ఉండే కందులను జొన్న, మొక్కజొన్న, మినుముతో కలిపి సాగు చేయవచ్చని అంటున్నారు.