హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి, అదీ అమెరికాలో చదివిన యువకుడు మన దగ్గరకు వచ్చి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఐదేండ్ల పాటు నెట్వర్ ఇంజినీర్గా పనిచేసిన ధీరజ్కుమార్.. ఆ ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో వ్యవసాయంలోకి దిగాడు. ఆయనతో పాటు ఆయన భార్య, సాఫ్ట్వేర్ ఇంజినీర్ జయలక్ష్మి కూడా పొలం బాట పట్టారు. అయితే, సంప్రదాయ పద్ధతుల జోలికి వెళ్లలేదు. విభిన్నంగా ఆలోచించారు. మార్కెట్ నాడి పట్టుకొన్నారు. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తున్నారు. పచ్చని పొలంలో సిరుల పంట పండిస్తున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపూర్ గ్రామంలో తమకు ఉన్న తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిలో వినూత్న రీతిలో సాగు చేస్తూ, అదిరిపోయే లాభాలు పొందుతున్నారు. గత వానకాలంలో మిర్చి పండించి, విదేశాలకు ఎగుమతి చేశారు.
ఈ యాసంగిలో ఆరు ఎకరాల్లో ఖర్బూజ సాగు చేస్తున్నారు. పంట మొత్తం ఒకేసారి వేయకుండా దశలవారీగా కోతకు వచ్చే విధంగా ప్రణాళికబద్ధంగా వ్యవహరించారు. తోలు మందంగా ఉండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండే కోహినూర్ రకాన్ని ఎంచుకొన్నారు. ఎత్తుమడుల్లో, పాలీమల్చింగ్ విధానంలో సాగు చేయడంతో మంచి దిగుబడి వచ్చిందని ధీరజ్ తెలిపారు. అన్ని ఖర్చులు పోను ఎకరాకు సగటున రూ.3 లక్షల వరకు మిగులుతుందని లెక్క చెప్తున్నాడు ఈ రోబోటిక్ ఇంజినీర్. గ్రామంలోని ఇతర రైతులు కూడా ధీరజ్ను ఆదర్శంగా తీసుకొంటున్నారు. అయితే, ఇక్కడ పండించిన పంటలను విదేశాలకు ఎగుమతి చేయాలంటే కోల్డ్ స్టోరేజీ కావాల్సి ఉంటుందని, ప్రభుత్వం సహకారం అందిస్తే.. చుట్టుపక్కల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
ఎకరాకు 3 లక్షల లాభం
ఖర్బూజ విత్తనం కిలో ధర రూ.70 వేలు. కిలో విత్తనాలు మూడెకరాలకు సరిపోతాయి. ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటిన మూడు రోజులకు మొలక వస్తుంది. పంట కాలం 60 రోజులు. మొదటి కోత కాయల బరువు కిలో నుంచి కిలోన్నర వరకు ఉంటుంది. రెండో పంట కాయల బరువు కిలో నుంచి 750 గ్రాముల వరకు ఉంటుంది. మూడు ఎకరాల్లో మొదటి కోత లో 16 టన్నుల దిగుబడి వచ్చింది. టన్నుకు రూ.35 వేలు పలికింది. మొదటి కాపులోనే దాదాపు రూ.5,60,000 వచ్చింది. మరో 10-12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఎరువులు, కోత కూలీ, కాయల ప్యాకింగ్, రవాణా ఖర్చులు అన్నీ పోను ఎకరాకు రూ.3 లక్షల వరకు మిగులుతుంది.
-ధీరజ్కుమార్, నారాయణపూర్ గ్రామం, బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా.